అమరావతి: కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రాజకీయ భవితవ్యం డోలాయమానంగా తయారయినట్లు కనబడుతోంది. ఆయన బిజెపిలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడుతూ వస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డా, ఇతర ముఖ్య నేతలను ఆదినారాయణరెడ్డి కలిశారనీ, బిజెపిలో చేరనున్నారనీ ఇటీవల మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. ఈ నెల రెండవ వారంలో ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బిజెపిలో చేరుతున్నట్లు ఆదినారాయణరెడ్డే స్వయంగా ప్రకటించారు. టిడిపితో విబేధాలు లేవనీ, తన అనుచరుల కోసమే బిజెపిలోకి వెళుతున్నాననీ ఆది చెప్పుకొచ్చారు. జగన్ దాష్టీకాలను ఎదుర్కోవాలంటే బిజెపి లాంటి గట్టి పార్టీ అవసరమని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. అమిత్షా సమక్షంలో బిజెపిలో చేరాలా లేదంటే నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో చేరాలా అనేది నిర్ణయిస్తామని ఆదినారాయణరెడ్డి చెప్పారు. ఇది జరిగి వారం రోజులు అయినప్పటికీ ఆదినారాయణరెడ్డి చేరికపై స్పష్టత రాలేదు. టిడిపి నుండి బిజెపిలో చేరిన అదే జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఆదినారాయణ చేరికను వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బిజెపిలో చేరితే తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుందని భావించే సిఎం రమేష్ అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే బిజెపి అధిష్టానం ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకునే విషయం వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆదనారాయణ రాజకీయ నేపథ్యం…
జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి దశాబ్దాలుగా ప్రత్యర్థులు. 2004, 2009 ఎన్నికల్లో నాటి టిడిపి అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి విజయం సాధించారు. తర్వాత 2014 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డిపై వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ మూడవ సారి విజయం సాధించి హాట్రిక్ సాధించారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటంతో ఆదినారాయణరెడ్డి వైసిపి అధినేత వైఎస్ జగన్కు ఝలక్ ఇచ్చి టిడిపిలో చేరగా చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు.
మూడు పర్యాయాలు అదే నియోజకవర్గంలో విజయం సాధిస్తూ వచ్చిన ఆదినారాయణరెడ్డికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు. జమ్మలమడుగు సీటు విషయంలో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ ఇద్దరూ పోటీపడగా టిడిపి అధినేత చంద్రబాబు వారిద్దరిమధ్య రాజీ కుదిర్చి ఆదినారాయణరెడ్డిని పార్లమెంట్, రామసుబ్బారెడ్డిని అసెంబ్లీ బరిలో నిలిపారు. అయితే చిరకాల వైరాన్ని పక్కన పెట్టి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కలిసిపోవడాన్ని జీర్ణించుకోలేని కొందరు టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు ముందే వైసిపిలో చేరారు. కడప పార్లమెంట్ స్థానంలో ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో రామసుబ్బారెడ్డి ఇద్దరూ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.
వైసిపి నుండి టిడిపిలో చేరిన ఆదినారాయణరెడ్డి మంత్రిగా ఉన్నంత కాలం నాటి వైసిపి అధినేత, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆదినారాయణ రెడ్డి పాత్ర ఉందంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి వైసిపిలోకి వెళ్లే అవకాశాలే లేకపోవడంతో బిజెపి వైపునకు మొగ్గు చూపుతున్నారు.
ఆదినారాయణరెడ్డి బిజెపిలో చేరికపై రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మోకాలు అడ్డుతున్న నేపథ్యంలో ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సి ఉంది.