ఒంగోలు: సవాళ్లు ఉంటాయనీ, విమర్శలు వస్తున్నాయనీ భయపడి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తిలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ‘నాడు-నేడు’ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఒంగోలులో ‘మన బడి -నాడు నేడు’ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఇంగ్లీషు మీడియం విషయంలో అవాంతరాలు అధిగమిస్తూ అడుగులు ముందుకు వేస్తామని అన్నారు. విద్యా విధానంలో ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొచ్చి మన పిల్లలు భావి ప్రపంచంతో పోటీపడే స్థాయికి తీసుకురావాలన్నదే తన తపన అని జగన్ పేర్కొన్నారు.
ఇంగ్లీషు మాధ్యమంలో బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సవాళ్లు ఉంటాయని పిల్లలను గాలికి వదిలివేస్తే వారి తలరాతలు మారవని జగన్ అన్నారు. ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశపెట్టిన మొదటి రెండు మూడు సంవత్సరాలు ఇబ్బందులు ఉంటాయనీ, తరువాత గాడిలో పడతాయని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా వ్యతిరేకంగా మాట్లాడినా పిల్లల ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా అవేమీ పట్టించుకోనని జగన్ అన్నారు.రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సినీ నటులు ఎవరూ వాళ్ల పిల్లలను తెలుగు మీడియంలో చదివించడం లేదు. సంస్కృతి పేరుతో పిల్లల భవిష్యత్ను పట్టించుకోకపోతే భావితరాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 45 వేల స్కూళ్లకు కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారనీ, ఇలా కేటాయింపులు చేస్తే స్కూళ్లు అభివృద్ధి చెందుతాయా అని ప్రశ్నించారు.
ప్రతి సంవత్సరం 15 వేల స్కూళ్లకు 3500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తామని జగన్ పేర్కొన్నారు. రాబోయే మూడు సంవత్సరాలో 12 వేల కోట్ల రూపాయలు పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ఖర్చు చేస్తామన్నారు.
గవర్నమెంట్ పరిస్థితి అంతంగా మాత్రంగా ఉంది కదా ఇవన్నీ ఎలా చేయగలుతారని ఒక చెల్లెమ్మ అడిగితే మంచి మనసుతో ముందడుగు వేస్తున్నాం, దేవుడి దీవెనలు ఉంటాయని చెప్పానన్నారు.