(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ ప్రకటన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖనగరంలో నేడు అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా జగన్కు భారీగా స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ విమానాశ్రయం నుండి కైలాసగిరి, ఆర్కెబీచ్లోని విశాఖ ఉత్సవ్ వే!దిక వరకూ దాదాపు 24 కిలో మీటర్ల మేర భారీ మానవహారం నిర్వహించనున్నారు.
విశాఖ పర్యటనలో భాగంగా మహా విశాఖ నగర పాలక సంస్థ (జివిఎంసి) పరిధిలో 905.50 కోట్ల రూపాయలు, విశాఖ నగరాభివృద్ధి సంస్థ( విఎంఆర్డిఏ) పరిధిలో 379.82 కోట్ల రూపాయల మేర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విశాఖ ఉత్సవ్ను కూడా ప్రారంభించనున్నారు.
విశాఖ నగరం రాష్ట్ర పరిపాలనా రాజధాని కావచ్చంటూ సిఎం ఇటీవల అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి భీమిలి నియోజకవర్గంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు కానున్నదని వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసేందుకు భారీగా స్వాగత ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సిఎం జగన్ శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి 3.10గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి 3.50 గంటలకు కైలాసగిరి వెళ్తారు. వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం సాయంత్రం 5.30 గంటలకు ఆర్కె బీచ్కు చేరుకుని విశాఖ ఉత్సవ్ను ప్రారంభిస్తారు.