అమరావతి: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పునరుద్ఘాటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రెవెన్యూశాఖపై బుధవారం అధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు. ఉగాది నాటికి పేదలకు ఇళ్ల పట్టాలు సంతృప్తికర స్థాయిలో మంజూరయ్యేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. గ్రామాన్ని యూనిట్గా తీసుకుని అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని సిఎం సూచించారు.
భూముల రీసర్వే, కౌలుదారుల రక్షణ చట్టంపై భూ యజమానులకు అవగాహన కల్పించడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
అనంతరం అర్బన్ హౌసింగ్, టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (టిడ్కో)పై సమీక్ష జరిపారు.
ఏ పనిలోనూ అవినీతి అనేది లేకుండా చూసుకోవాలని జగన్ సూచించారు. వాస్తవ రేట్లు ఏమిటి, మనం నిర్ణయించిన రేట్లు ఏమిటి అన్నది ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలని జగన్ చెప్పారు. రేట్ల ఖరారు చేయడానికి నిపుణుల సలహాలు తీసుకోవాలని జగన్ సూచించారు. ఇప్పుడు ఉన్న ఎస్ఎస్ఆర్ను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనీ, వాస్తవ రేట్లను పరిగణనలోకి తీసుకొని రివర్స్ టెండర్లు ఖరారు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఇసుక ఉచితం, స్థలం ఉచితం, సబ్సిడీపై సిమెంట్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా రేట్లు తగ్గాలని జగన్ పేర్కొన్నారు.
ఈ నెలాఖరు నాటికి కొత్త రేట్లు ఖరారు చేస్తామనీ, వచ్చె నెలలో రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ, ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.