హైదరాబాద్: ప్రముఖ హస్యనటుడు సునీల్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురువారం ఉదయం చికిత్స నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షలను నిర్వహించిన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య, గొంతు ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు.
మరోవైపు సునీల్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారనే వార్తతో సినీ వర్గాలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. సైనస్, ఇన్ ఫెక్షన్ కారణంగా డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో చేరానని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడం వల్ల సునీల్ అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది.
కాగా, సంక్రాంతి కానుకగా విడుదలైన అల.. వైకుంఠపురము సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో హస్యనటుడిగా మరోసారి ప్రేక్షకులను మెప్పించారు.