జైపూర్: మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రముఖ హిందీ టీవీ నటి పాయల్ రోహత్గిపై రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 21న పాయల్ రోహత్గి స్వాతంత్ర్య సమరయోధుడు మోతీలాల్ నెహ్రూతోపాటు జవహర్లాల్ భార్యపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడమే కాక.. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాంతో చర్మేశ్ శర్మ అనే ఓ కాంగ్రెస్ నేత పాయల్ రోహత్గి మీద పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై సెక్షన్ 66,67 కింద కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ.. ‘పాయల్ జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీ లాల్ నెహ్రూతో పాటు ఆయన భార్య, తల్లిని కూడా అవమానిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాక లాల్బహుదూర్ శాస్త్రి మరణం గురించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. విదేశాలు, మన దేశం గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పర్చుకునేలా ఈ వీడియో ఉంది. పాయల్ మాజీ ప్రధానులను అవమానించడమే కాక దేశ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని తెలిపాడు. కాగా, టీవీ రియాలిటీ షోల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. 2008లో బిగ్బాస్ షోలో కూడా పాల్గొన్నది.
https://youtu.be/dC2zNXuKvGs