న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించారని వ్యాఖ్యానించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కాంగ్రెస్ పార్టీ కోరింది. ప్రధాని ప్రకటన కేవలం కోడ్ ఉల్లంఘన మాత్రమే కాక, భారతరత్న అవార్డు వచ్చిన అమరుడికి అవమానమని యూపీ కాంగ్రెస్ ఈసీకి రాసిన లేఖలో మండిపడింది. ప్రధాని మోదీ ఇక బహిరంగ సభలలో ప్రసంగించకుండా ఆయనను నిషేధించాలని కోరింది.
ఎన్నికల కమిషన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వచ్చిన ఆరు ఫిర్యాదులను ఇప్పటివరకు తిరస్కరించింది. ఆయన ప్రసంగాలు ఎక్కడా కోడ్ ఉల్లంఘన కాదని తెలిపింది. అయితే కమిషన్ నిర్ణయంతో ఒక కమిషనర్ విభేదించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మీద నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ‘‘మీ తండ్రిని ఆయన అనుంగు అనుచరులు మిస్టర్ క్లీన్ అంటారేమో, కానీ ఆయన జీవితం అవినీతిపరుడు నెం.1గా ముగిసింది’’ అని ప్రధాని యూపీలో జరిగిన ఓ ర్యాలీలో వ్యాఖ్యానించారు.
మోదీ వ్యాఖ్యలను చిదంబరం, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ లాంటి కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. మరోవైపు అరుణ్ జైట్లీ, ప్రకాష్ జావడేకర్ లాంటి కేంద్ర మంత్రులు మోదీని సమర్ధించారు.