న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచారంలో ప్రధాన నినాదం ‘అబ్ హోగా న్యాయ్’. ఈ అస్త్రంతో ముందుకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన పేదలకు కనీస ఆదాయ పధకం (న్యాయ్) కేంద్రంగా ఈ అబ్ హోగా న్యాయ్ (ఇకఓఓ న్యాయం జరుగుతుంది.) నినాదం రూపొందించారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అందరికీ న్యాయం దొరుకుతుందని కూడా ఈ నినాదం సూచిస్తుంది.
దేశంలోని నిరుపేదల కుటుంబాలకు నెలకు ఆరువేల రూపాయల చొప్పున సంవత్సరానికి 72 వేల రూపాయల ఆర్ధిక సహాయం నేరుగా అందిస్తామని రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం ప్రకటించింది. దేశంలో 20 శాతం కుటుంబాలు ఈ సహాయానికి అర్హమని అంచనా. ‘కాంగ్రెస్ చేయగలదు’ అన్న శీర్షికతో వెలువరించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం అన్న రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.
వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా బడ్జెట్ రూపొందిస్తామనీ, అందరికీ ఆరోగ్య రక్షణ కల్పిస్తామనీ, విద్యారంగానికి కేటాయింపులు రెట్టింపు చేస్తామనీ, మహిళల రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేస్తామనీ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. ఇకమీద ఎన్నికల ప్రచారంలో ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు.