( న్యూస్ ఆర్బిట్ డెస్క్)
విజయవాడ: సార్వత్రిక సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలియజేయడంతో ప్రైవేటు పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.
విజయవాడలో కాంగ్రెస్, వామపక్ష, కార్మిక, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. జాతీయ రహదారిపై నేతలు ఆందోళనకు దిగడంతో విజయవాడ – హైదరాబాదు రహదారిపై కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
వామపక్ష నేతలు రామకృష్ణ, బాబురావు, కాంగ్రెస్ పార్టీ నేత నరహారశెట్టి నరసింహరావు, మైనారిటీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పోలీసుల అక్రమ అరెస్టులను ఖండించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఎన్ఆర్సి, సిఏఏ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధాన వల్లే నేడు భారత్ బంద్ చేపట్టామని పేర్కొన్నారు. బంద్కు వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఎన్ఆర్సి బిల్లుపై టిడిపి, వైసిపి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని విమర్శించారు.
విశాఖపట్నంలో కేంద్రం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీలు ర్యాలీ నిర్వహించారు. కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని నేతలు విమర్శించారు. వామపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసుల అరెస్ట్లు చేయడం దారుణమని నేతలు మండిపడ్డారు.