న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉందనీ, తాను ఎప్పుడో రాజీనామా చేశాననీ రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో హడావుడిగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్దలు రాహుల్ వారసుడి ఎంపిక పనిలో పడ్డారు. మహారాష్ట్రకు చెందిన సుశీల్ కుమార్ షిండే కానీ, కర్నాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే కానీ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ చరిత్రలో గాందీ నెహ్రూ కుటుంబం నుంచి కాకుండా బయటివారు పార్టీ నాయకత్వం చేపట్టడం ఇది మూడవసారి అవుతుంది. గతంలో పివి నరసింహారావు, సీతారాం కేసరి పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు.
నూతన అధ్యక్షుడి ఎంపికలో తన ప్రమేయం ఉండదని రాహుల్ గాధీ స్పష్టం చేస్తున్నప్పటికీ, తుది నిర్ణయం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఇష్టం పైనే ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికి వినబడుతున్న రెండు పేర్లలో సుశీల్ కుమార్ షిండేకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కనబడుతోంది. 77 ఏళ్ల షిండే గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆయన దళితుడు. 76 ఏళ్ల ఖర్గే కూడా గాందీ కుటుంబానికి విధేయుడే. గత లోక్సభలో ఆయన కాంగ్రెస్ పక్షనేతగా సమర్ధంగా వ్యవహరించారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఖర్గే మొన్నటి ఎన్నికలలో మొదటిసారి ఓడిపోయారు.