న్యూఢిల్లీ: దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ శనివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో వేదికగా కాంగ్రెస్ పార్టీ ‘భారత్ బచావ్’ ర్యాలీకి చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర కీలక నేతలందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై సోనియా విమర్శలు గుప్పించారు.
దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, దేశంలోని పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు. అధిక ధరలతో ప్రజలు అల్లాడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పోరాటం చేయాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ‘దేశంలోని యువతకు ఉద్యోగాలు రావట్లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు అందట్లేవు. పౌరసత్వ బిల్లు వల్ల భారతీయ ఆత్మ ముక్కలు ముక్కలు అవుతుందన్న విషయాన్ని మోదీ, అమిత్ షాలు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు’ అని సోనియా గాంధీ మండిపడ్డారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రజలను, వారి మనోభావాలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైపోయిందని, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘ఆర్థిక వృద్ధిని కోల్పోయాం. ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రజలు మౌనం వహిస్తే మన రాజ్యాంగాన్ని కూడా నాశనం చేస్తారు. చీకటిలో, భయంలో కూరుకుపోతాం. బీజేపీ-ఆర్ఎస్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారు. ఆరేళ్ల బీజేపీ ప్రభుత్వలో కొత్త ఉద్యోగాలు కాదు కదా ఉన్న ఉద్యోగాలు పోయాయి. జీఎస్టీ వల్ల వ్యాపారులు నష్టపోతున్నారు. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వ్యాపార సంస్థలు మూతబడుతున్నాయి’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు.
దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లోనే నాశనం చేసేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ఈ సమస్యపై కేంద్ర మంత్రుల వద్ద ఎటువంటి పరిష్కార మార్గాలు లేవని చెప్పారు. ‘నిన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ అంతా బాగానే ఉందని అన్నారు. అచ్చేదిన్ త్వరలోనే వస్తుందన్న వ్యాఖ్యను మాత్రమే ఆమె చేయలేదు. మిగతా అన్ని విషయాలను చెప్పారు’ అని చిదంబరం చురకలంటించారు.