ఏపిలో స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాద సంఘటన మాదిరిగానే తెలంగాణలో శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదం రాజకీయ ప్రకంపనలుసృష్టిస్తోంది.
స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాదంలో రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం, హోటల్ నిర్వహణ లోపాలు, అధికారుల పర్యవేక్షణ లోపంతదితర అంశాలు బయటకు రావడం, ఈ ఘటనపై అధికార, ప్రతి పక్షాల మధ్య మాటల యుద్ధాలు జరుగుతుండగా, అటు తెలంగాణలో శ్రీశైలం పవర్ ప్లాంట్ జరిగిన అగ్ని ప్రమాదంలోనూ అధికారుల వైఫల్యం ఏమైనా ఉందా, ప్రమాదమేనా అనే విషయాలు తెలాల్సి ఉండగా అక్కడ కూడ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య దీనిపైనా రగడ జరుగుతోంది. శ్రీశైలం ఘటనపై సిఐడి విచారణ చేపట్టింది. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు, వివాాదాలు, రాజకీయాలు వదలడం లేదు.
మూడు రోజుల క్రితం శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది అధికారులు, ఉద్యోగులు దుర్మరణం పాలైయ్యారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్వహణ లోపాల కారణంగానే శ్రీశైలం ప్రమాదం జరిగిందని ఒక వైపు మాటలు వినిపిస్తుండగా నిర్లక్ష్యం అంటూ ఏమీ లేదని జెన్ కో కొట్టిపారేస్తున్నది. కేబుళ్లపై నీటి తుంపర్లు పడి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని స్థానిక అధికారులు రెండు రోజుల ముందే ఉన్నతాధికారులకు సమాచారం అందించినా వారు స్పందించకపోవడం వల్ల ఈప్రమాదం జరిగిందని,
శ్రీశైలం ప్లాంట్ లో మరి కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకు నేందుకు సిఐడి రంగ ప్రవేశం చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తును చేపట్టింది. సిఐడి చీఫ్ గోవింద్ సింగ్, డిఐజి సుమతి ఆధ్వర్యంలో అధికారుల బృందం విచారణ జరుపుతోంది. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే షార్ట్ సర్క్యూట్ గల కారణాలను విశ్లేసించే పనిలో సిఐడి నిమగ్నమైంది. ప్రమాదం జరిగిన స్థలంలో ప్రాధమిక సాక్షాలను దర్యాప్తు బృందం సేకరించింది.
ఘటనా స్థలంలో కాలిపోయిన వైర్లుతో పాటు పవర్ సప్లైకి ఉపయోగించిన వైర్లకు సంబంధించిన కాలిన పదార్ధాలను సిఐడి అధికారులు సీజ్ చేసి ఫొరెనిక్స్ ల్యాబ్ కు పంపారు. అధికారుల నుండి శ్రీశైలంలో ప్రమాదానికి సంబంధించిన వివరాలను సిఐడి అధికారులు నమోదు చేసుకున్నారు. సిఐడి సాంకేతిక బృందం అక్కడ కాలిన పదార్ధాలలో వాటర్ ఉందా లేదా అన్నదానిపైనా విశ్లేషణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి సిఐడి.. మానవ తప్పిదం ఏమైనా ఉందా లేదా అనేది తేల్చనున్నది.
ఇది ఇలా ఉండగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డి, మాజీ ఎంపి మల్లు రవిలు శ్రీశైలం ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి బయలు దేరగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంలో కెసిఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూనే కెసిఆర్ ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జల దోపిడీకి కెసిఆర్ సహకరిస్తున్నారని విమర్శించారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ విద్యుత్ ప్రాజెక్టును చంపేసే కుట్ర చేస్తున్నదని తాము చాలా కాలంగా చెబుతున్నామన్నారు. ఈ దుర్ఘటన అనుమానాలకు తావు ఇస్తుందన్నారు.
ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ప్రమాదంపై ముందుగానే సమాచారం ఉన్నా ప్రభుత్వం స్పందించలేదన్నారు. సిఐడి విచారణ పేరుతో ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తుందని, ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి, అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రాలో జరుగుతున్న ప్రమాదాలు అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య రచ్చకు వేదికలు అవుతున్నాయి.