ముంబాయి: మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి), కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది. దీనికి ఆయా పార్టీల నాయకులు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించారు.ఈ కార్యక్రమానికి మూడు పార్టీలు ఆమోదించాయి. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది.పదవుల పంపకాలపై కూడా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.సిఎం పిఠాన్ని ఐదేళ్ల పాటు శివసేనకు ఇచ్చేందుకు ఎన్సిపి, కాంగ్రెస్ అంగీకరించాయి. కాంగ్రెస్కు అసెంబ్లీ స్పీకర్, ఎన్సిపికి మండలి చైర్మన్ దక్కేలా నేతలు అంగీకారానికి వచ్చారు.శివసేనకు సిఎంతో పాటు 14 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఎన్సిపికి డిప్యూటీ సిఎం, 14 మంత్రి పదవులు, కాంగ్రెస్కు డిప్యూటీ సీఎంతో పాటు 12 మంత్రి పదవులు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.మూడు పార్టీల అధినేతలు ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్, సోనియా గాంధీ అంగీకారం తెలిపారు.
సిఎం పీఠాన్ని ఎన్సిపి, శివసేనే చెరి రెండున్నరేళ్లు పంచుకుంటాయని తొలి నుంచి ప్రచారం జరిగినా చివరికి శివసేనకు ఇచ్చేందుకు ఇరు పార్టీలు ఆమోదం తెలిపాయి. ఈ మేరకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం వివరాలను వెల్లడించారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ పార్టీల నేతలంతా గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న కారణంగా గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. అక్టోబర్ 24న ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటికీ భాగస్వామ్య పార్టీలైన బిజెపి, శివసేన మధ్య విభేదాలు రావడంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్నది.