లక్నో: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని నిందితులు గత ఏడాది కాలం నుంచి వేధిస్తున్నా, భద్రత ఎందుకు కల్పించలేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను ప్రియాంక పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిందితులకు బీజేపీతో సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే నేరస్థులను రక్షిస్తున్నారని ఆరోపించారు. నేరగాళ్లకు భయంలేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో నేరస్థులకు చోటు లేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు, కానీ మహిళలకు స్థానం లేకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
2017లో జరిగిన అత్యాచారం ఘటన నుంచి రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదని విమర్శలు గుప్పించారు. ‘గతంలో ఉన్నావోలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం బాధితురాలికి ఎందుకు భద్రత కల్పించలేకపోయింది. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయని అధికారిపై ఏ చర్యలు తీసుకున్నారు? ఉత్తరప్రదేశ్ లో మహిళలపై జరుగుతోన్న దాడులను అరికట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?’ అని ఆమె ప్రశ్నించారు. ఉన్నావో అత్యాచార బాధితురాలి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని తాను ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో శాంతి, భద్రతలు అదుపుతప్పాయని ప్రియాంక ఆరోపించారు.
Priyanka Gandhi Vadra on Unnao rape case: Victim's whole family has been constantly harassed since last year. I have heard that the culprits have some BJP connection. That is why they were being shielded. There is no fear among criminals in the state. pic.twitter.com/eDP5QOHXoX
— ANI UP (@ANINewsUP) December 7, 2019
డిసెంబర్ 5వ తేదీ ఉన్నావ్ బాధితులరాలు కోర్టు విచారణ కోసం రాయ్ బరేలీ వెళ్లేందుకు బయలుదేరగా.. ఐదుగురు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. కిరోసిన్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలతో కొనఊపిరితో ఉన్న యువతిని మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీ, సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం(డిసెంబర్ 6) రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.