హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ‘తిరంగ ర్యాలీ’కి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో గాంధీభవన్ లో పార్టీ నేతలు ‘సత్యాగ్రహ దీక్ష’కు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తిరంగ ర్యాలీ’ చేపట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తుండగా, వారిని అడ్డుకొని గాంధీభవన్ బయట పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘సేవ్ నేషన్-సేవ్ కాన్స్టిట్యూషన్’ పేరుతో ర్యాలీ చేయాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. గాంధీభవన్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకూ ర్యాలీ చేయాలని తలపెట్టారు. అయితే, ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. గాంధీ భవన్ నుంచి బయటకు రాకుండా పోలీసులు పహారా కాయడంతో వారి తీరుపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీని అడ్డుకున్నందున కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్లోనే ‘సత్యాగ్రహ దీక్ష’ చేస్తున్నారు. 24 గంటలపాటు దీక్ష కొనసాగించాలని నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు పార్టీ నాయకులు కుంతియా, భట్టి, శ్రీధర్ బాబు తదితరులు దీక్షలో కూర్చున్నారు. తమ కార్యకర్తలు గాంధీ భవన్కు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ కేసీఆర్కు ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్కు కాంగ్రెస్ భయం పట్టుకుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీని వాయిదా వేసుకోబోదని, ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరతామని భట్టి స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ర్యాలీకి మద్దతిచ్చిన కేసీఆర్, ఎంఐఎంతో కలిసి బీజేపీకి మద్దతు పలుకుతున్నాయని ఆరోపించారు.
మరోవైపు కాంగ్రెస్ ‘తిరంగ ర్యాలీ’కి పోలీసులు అనుమతి నిరాకరణ నేపథ్యంలో గాంధీ భవన్ కు వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తల డీసీఎంను ట్యాంక్ బండ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను రాంగోపాల్ పేట్, నారాయణ గూడ పోలీస్ స్టేషన్ల కు తరలించారు.
అంతకుముందు.. గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలను ఉత్తమ్ గుర్తు చేసుకున్నారు. 135 సంత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో తీసుకొచ్చిన పథకాల గురించి ఆయన వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. సీఏఏ, ఎన్ఆర్సీ లాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు.