(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నుంచి అనుమతిరాని నేపథ్యంలో గాంధీభవన్లోనే శనివారం ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టాలని టీపీసీసీ కోర్ కమిటీ నిర్ణయించింది. నేడు(డిసెంబర్ 28) కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం. దేశవ్యాప్తంగా రగులుతున్న సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ‘సేవ్ నేషన్ – సేవ్ కాన్స్టిట్యూషన్’ నినాదంతో హైదరాబాద్ లో భారీ ర్యాలీకి నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించారు. రెండుసార్లు అనుమతి కోసం పోలీసులను ఆశ్రయించినా అనుమతి లభించలేదు. దీంతో ఇవాళ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్లోనే సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. 24 గంటల దీక్ష చేయనున్నారు.
ప్రభుత్వం, పోలీసుల తీరుపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘హైదరాబాద్ నడిబొడ్డున.. ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ స్టేడియం వరకూ ట్రాఫిక్ను క్లియర్ చేసి, రోడ్డును బ్లాక్ చేసి.. కవాతు కోసం ఆర్ఎ్సఎ్సకు రాచమర్యాదలతో పోలీసులు అప్పజెప్పారు. కానీ శాంతియుతంగా తిరంగా యాత్ర చేస్తామని కోరిన కాంగ్రెస్కు అనుమతి ఎందుకు ఇవ్వరు?’’ అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ భారీ సభకు అనుమతినిచ్చిన కేసీఆర్ సర్కారు.. తిరంగా మార్చ్ పేరుతో కాంగ్రెస్ నిర్వహించే ర్యాలీకి ఎందుకు ఇవ్వదని విమర్శలు గుప్పించారు.