న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదరు అజిత్ దోవల్ కశ్మీర్ లోయలోని షోపియన్ పట్టణంలో స్థానికులతో ముచ్చట్లు చెప్పుకుంటూ రోడ్డు పక్కన టిఫిన్ తింటున్న ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్టంట్ కింద కొట్టిపారేశారు. డబ్బుతోటి ఏమైనా చేయవచ్చని వ్యాఖ్యానించారు. దీనిపై బిజెపి మండిపడింది. ఆజాద్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
విమానంలో శ్రీనగర్ వెళ్లేముందు విలేఖరులతో మాట్లాడిన గులాం నబీ ఆజాద్, పైసె దేకర్ ఆప్ కిసీకొభీ సాథ్ లే సక్తే హో అన్నారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రానిక ఆర్టికల్ 370 వర్తింపును రద్దు చేసిన దగ్గర నుంచీ ఆంక్షలు అమలులో ఉన్న శ్రీనగర్లోకి ఆయనను అనుమతించే అవకాశం తక్కువ. విమానాశ్రయం నుంచే వెనక్కు పంపే సూచనలు ఉన్నాయి.
ప్రజలతోనే కాకుండా పారా మిలటరీ జవాన్లతో కూడా దోవల్ మాట్లాడుతున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. గతంలోఎన్నడూ లేనంత స్థాయిలో భద్రతా దళాలను కొద్ది రోజులుగా కశ్మీర్లో మోహరించిన కేంద్రం అక్కడ పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయన్న సందేశాలు పంపడానికి ఈ వీడియోలు, ఫొటోలు విడుదల చేసిందని భావిస్తున్నారు.