(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) : ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోమారు బయటకు వచ్చాయా? ఎంపీ రేవంత్ రెడ్డి సొంతపార్టీలో తన మాట నెగ్గించుకున్నారా ? ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమం టీకాంగ్రెస్లో మరోసారి కాక పెట్టినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరుపై పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ప్రగతిభవన్ ముట్టడితో రేవంత్ పేరు మారుమోగడంతో, కొందరు సీనియర్లు మండిపోతున్నారట. అసలు పార్టీ అజెండా కాకుండా, రేవంత్ తన సొంత అజెండాను అనుసరిస్తున్నారని ఫైరవుతున్నారట.
రేవంత్ రెడ్డి ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని సీనియర్లు కన్నెర్ర చేస్తున్నారు. సోమవారం ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా రేవంత్ రెడ్డి చూపించిన దూకుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అయితే రేవంత్ ఇలా దూసుకుపోవటం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు నచ్చటం లేదు. రేవంత్ రెడ్డి ఎవరినడిగి ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు అంటూ పార్టీలోని సీనియర్ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎవరిని సంప్రదించి ప్రగతి భవన్ ముట్టడి ప్రకటించారని ఫైర్ అవుతున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి సంబంధించి తమకు కనీసం సమాచారమైనా ఇవ్వలేదని మండిపడుతున్నారు. పార్టీలో సీనియర్ నేతలను ఎవరినీ సంప్రదించకుండా, ఎవరికీ చెప్పకుండా తనకు తాను నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క దగ్గర పంచాయతీ పెట్టారట కొందరు నేతలు.
సీఎల్పీ కార్యాలయంలో వీహెచ్, సంపత్ కుమార్, మధుయాష్కీ, వంశీచందర్తో పాటు కొందరు నేతలు భట్టి విక్రమార్కని కలిసి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని ఖండించారు. ఎవరిని అడిగి, ముట్టడి కార్యక్రమం తలపెట్టారని, ఎవరినీ సంప్రదించకుండా రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు అని, ఈ విషయాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని వారు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో ఆర్టీసి సమ్మెపై మాట్లాడిన రేవంత్, ప్రభుత్వం మెుండి వైఖరిని వీడకుంటే ఈనెల 21వ తేదిన ప్రగతిభవన్ ముట్టడిస్తామని పార్టీలో చర్చించకుండానే ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి ప్రకటన తరువాత సొంతపార్టీలో సీనియిర్లు, రేవంత్ తన సొంత ఎజెండానే పార్టీపై రుద్దుతున్నారని విమర్శలు చేశారు. దీంతో పార్టీని ఒప్పించడానికి రేవంత్ అష్టకష్టాలు పడ్డారన్న చర్చ జరుగుతోంది. రేవంత్ ప్రగతిభవన్ ముట్టడిస్తామని ప్రకటన చేసిన తరువాత పార్టీ సీనియర్ నేత విహెచ్, జగ్గారెడ్డి లాంటి వాళ్లు ఆయన ప్రకటన చేస్తే, మేము ముట్టడిలో పాల్గొనాలా అంటూ ప్రశ్నలు వేశారట. దీంతో రేవంత్ హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారం ముగియగానే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా ప్రగతిభవన్ ముట్టడికి పార్టీ నేతలంతా పాల్గొనాలని ప్రకటన చేయించారట. దీంతో విధిలేని పరిస్థితిలో పార్టీలో సీనియర్లంతా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చినట్లు పార్టీలో మాట్లాడుకుంటున్నారు.
ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నేతలందర్నీ గృహనిర్భంధం లేదంటే, ఎక్కడిక్కడ అరెస్టు చేశారు. అయితే, రేవంత్ రెడ్డి మాత్రం జూబ్లీహిల్స్ లోని తన ఇంటి వద్ద ఉన్న పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకుని, ప్రగతి భవన్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో రేవంత్ హీరోగా నిలిచారు. ఈ నేపథ్యంలో రేవంత్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారట. సొంత అజెండాతో రేవంత్ రెడ్డి హైలెట్ కావాలనుకుంటున్నారని, ఆయనపై కారాలు మిరియాలు నూరారట. దీనిపై అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేస్తామని అన్నారట నేతలు. మొత్తానికి ముట్టడి కార్యక్రమంలో హల్చల్ చేసిన రేవంత్ రెడ్డిని, పార్టీలో కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం రగిలిపోతున్నారు.