హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగలనున్నది. ఆ పార్టీ శాసన సభ పక్షాన్ని టిఆర్ఎస్లో విలీనం చేస్తూ లేఖ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు ఫిరాయింపు నేతలు. 13 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో పది మంది కాంగ్రెస్కు హ్యాండిచ్చి ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో నిలిపినా చివరి నిమిషంలో ఎన్నికను బహిష్కరించాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. అలాగే మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టిఆర్ఎస్లో విలీనం చేయమని ఫిరాయింపు నేతలు లేఖ ఇవ్వగా మండలి చైర్మన్ ఆమోదించారు. ఈ విధమైన పరిస్థితి ఇప్పుడు శాసనసభలోనూ జరగనుండటం కాంగ్రెస్కి మింగుడు పడటంలేదు.
కాంగ్రెస్ పార్టీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్లో చేరుతున్నారంటూ వార్తలు వచ్చాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యలు ఈ నెల 24న గులాబి కండువా కప్పుకోనున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్క ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ మారుతున్నారన్న వార్తలపై ఆరా తీశారు. వారు ఆ వార్తలను కొట్టి పారేశారు.
వార్తలను ఖండించినంత మాత్రాన పార్టీ మారే అవకాశం లేదనుకోవటం పొరపాటే. కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్లో చేరిన వారిలో చాలా మంది ఇలాంటి వార్తలను ఖండించినవారే. ఇందుకు తగ్గట్లే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కెటిఆర్తో భేటీ అయ్యి పార్టీలో చేసురుతున్నట్టు కూడా వెల్లడించారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా గల్లంతు అయ్యే పరిస్థితి నెలకొన్నది.
విలీనం అంటూ జరిగితే న్యాయపోరాటం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మండలి పక్ష విలీనాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో వివరణ కోరుతూ ఫిరాయింపు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. శాసనమండలి ఛైర్మన్, కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా సభాపతికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ గవర్నర్ నరసింహన్ను రాజ్భవన్లో కలిసి ఫిర్యాదు చేసింది. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా కాంగ్రెస్ నేతలు ఫిరాయంపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే స్థానిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఈ విలీనం అనే ప్రక్రియ జరగటం గట్టి దెబ్బనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఖమ్మం జిల్లా నుండి రేగ కాంతారావు (పినపాక), అత్రం సక్కు (అసిఫాబాద్), హరిప్రియ నాయక్ (ఇల్లందు), కందల ఉపేందర్ రెడ్డి (పాలేరు), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), రంగారెడ్డి జిల్లా నుండి పి సబితా ఇంద్రారెడ్డి (మల్లేశ్వరం), దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఎల్ బి నగర్), నల్లగొండ జిల్లా నుండి చిరుమర్తి లింగయ్య (నకిరేకల్లు), మహబూబ్ నగర్ జిల్లా నుండి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి ఇప్పటికే టిఆర్ఎస్లో చేరినవారిలో ఉన్నారు.