హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టడం మంచిది కాదని తాను ఆనాడే చెప్పానని కేసీఆర్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో ఆచితూచి ఖర్చు పెట్టాలని అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుకు తాను సూచించానని అన్నారు. అయితే తన మాటలు ఆయన పట్టించుకోలేదని తెలిపారు. అమరావతి నిర్మాణం కంటే రాయలసీమకు నీళ్లు తీసుకురావడం, నీటిపారుదల ప్రాజెక్టులకు ఖర్చుపెట్టాలని తాను చేసిన సూచనను పెడచెవిన పెట్టారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో రైతాంగం అభివృద్ది కోసం తాము సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రధమ ప్రాధాన్యత ఇచ్చినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.
మరోవైపు ఏపీ రాజధాని అమరావతిని మారుస్తారనే అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజధానిపై రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్ర రాజధానిగా అమరావతి సురక్షితం కాదన్న శివరామకృష్ణన్ కమిటీ నివేదిక వాస్తవమేనని, దీనిమీద మళ్లీ చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ‘మామూలు ప్రాంతాల్లో నిర్మాణానికి లక్ష రూపాయలు ఖర్చయితే… అమరావతిలో రెండు లక్షలు అవుతుంది. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుంది. అక్కడ వర్షాలు వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఉన్నాయి. దీనికోసం మళ్లీ వేరుగా కాల్వలు తవ్వాలి, డ్యామ్లు కట్టాలి. వరద నీటిని కింది నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. అమరావతిపై త్వరలోనే మా విధానాన్ని ప్రకటిస్తాం’ అని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధాని అమరావతి ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇదిఇలా ఉంటే.. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణ పనులు అగిపోయాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.