(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గణాంకాలను ఎన్నికల సంఘం వెంటనే విడుదల చేయక పోవడంతో ఈసీ తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం 6.30 గంటలకు 55.10 శాతం పోలింగ్ నమోదైందని ప్రకటించిన ఈసీ రాత్రి 10.17 గంటలకు 61.43 శాతం నమోదైందని తెలిపింది. మొబైల్ యాప్కు, ఎన్నికల సంఘం చెప్పే గణాంకాలకు పొంతన లేదు. దాంతో ఆప్ అధినేత, సిఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘ఈవీఎంలను మార్చేస్తున్నారా!?’ అని ట్విటర్లో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సందేహం వ్యక్తం చేశారు.
‘ఎన్నికల కమిషన్ ఏమిచేస్తోంది? పోలింగ్ ముగిసి ఎన్నో గంటలు గడిచినా తుది గణాంకాలు ఎందుకు విడుదల చేయడం లేదు? ఇది దిగ్బ్రాంతికరం’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా ఆరోపించారు. అందుకు సాక్ష్యంగా ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా ఈడి చర్యలను తప్పు పడుతూ ట్వీట్ చేశారు. అయితే తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించడంలో అసాధారణ జాప్యం ఏమి జరగలేదని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి రణబీర్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో 13,700కు పైగా పోలింగ్ బూత్లు ఉన్నాయనీ, ఒక్కో బూత్ నుంచి పక్కా సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడం వల్లే ఆలస్యమైందనీ చెప్పారు. తుది పోలింగ్ 62.59 శాతమని ఆదివారం రాత్రి వెల్లడించారు. దీనిని ఈసీ యాప్లో 61.85 శాతంగా పేర్కొనడం గమనార్హం.
ఆప్ గెలుపు కోసం తాము త్యాగం చేశామని కాంగ్రెస్ నేత కేటీఎస్ తులసి చెప్పారు. ఢిల్లీ సీఎం పీఠం మళ్లీ ఆప్దేనని అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పిన సంగతి తెలిసిందే. ఓ వార్తా సంస్థతో తులసి మాట్లాడుతూ ఓట్ల చీలికను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసిందన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కూడా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే ఓట్లు చీలి బీజేపీ లభిస్తుందని నిర్ణయం తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి కూడా ఆప్కే విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేజ్రీవాల్ గెలిస్తే అభివృద్ధి అజెండా గెలిచినట్లేనని అయన వ్యాఖ్యానించారు. పార్టీ ఢిల్లీ ఇన్చార్జి పీసీ చాకో మాత్రం ఎగ్జిట్ పోల్స్ తప్పు అని అంటున్నారు.
మరో పక్క బిజెపి మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఏమీ ‘ఎగ్జాక్ట్ పోల్స్’ కాదని అంటున్నది. ఢిల్లీలో మళ్లీ ఆప్దే విజయమన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బిజెపి ఎంపీ మీనాక్షి లేఖి తిరస్కరిస్తున్నారు. సీఎం కేజ్రీవాల్ కూడా ఓడిపోతారని ఆమె అన్నారు.. ‘కేజ్రీవాల్ సొంత నియోజకవర్గాన్ని కోల్పోతారు. నేనీ విషయాన్ని పూర్తి నమ్మకంతో చెబుతున్నా. బీజేపీ గెలుస్తుంది’అని అన్నారు. బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాత్రి అమిత్ షాతో భేటీ అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ‘ఎగ్జిట్ పోల్స్లో భాగంగా నియోజకవర్గానికి రెండు బూత్లను విశ్లేషిస్తారు. మొత్తం 13 వేలకు పైగా బూత్లు ఉన్నాయి. ఈ విశ్లేషణ సాయంత్రం 4-5 గంటలకు చేస్తారు. కానీ, ఆ తర్వాత 11-15 శాతం ఓటింగ్ జరిగింది. మా ఓటర్లు సాయంత్రం ఎక్కువగా పోలింగ్ బూత్లకు వచ్చారు.’ అని లేఖి పేర్కొన్నారు.