అమరావతి: సంక్షేమ పథకాల అమలు కోసం బిల్డ్ ఏపి పేరుతో ప్రభుత్వ భూములు, యూనివర్శిటీల స్థలాలను విక్రయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతుందా లేదా అన్న ప్రశ్న వినబడుతంది. ఈ నిర్ణయానికి ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు ఎదురుకావడం ఈ ప్రశ్నకు ఆస్కారం కల్పించింది. ప్రభుత్వ భూములు భావితరాలకు లేకుండా విక్రయించే హక్కు సర్కారుకు లేదని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర విపక్షాలు వాదిస్తున్నాయి. ప్రభుత్వ భూముల సంగతి అలా ఉంచితే యూనివర్సిటీల భూములు అమ్మడం అసలు కుదరదని అంటున్నారు
రాష్ట్రంలో ప్రభుత్వానికి చెందిన ఖాళీ భూములు చాలా చోట్ల ఉన్నాయి. కొన్ని వివాదాల్లో ఉండగా మరి కొన్ని చోట్ల ఆక్రమణల్లో ఉన్నాయి. వీటిని విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో నవరత్న పథకాలు, నాడు నేడు పథకం అమలు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్ ఇప్పటికే ప్రభుత్వ సంస్థలు, శాఖలు, విశ్వవిద్యాలయాలు, స్వయం ప్రతిపత్తి హోదా కల్గిన సంస్థలు, గ్రామ, పట్టణ సంస్థలు తమ పరిధిలోని భూముల వివరాలు పంపాలని జిల్లా కలెక్టర్లను కోరారు. భూముల విక్రయాల కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పోరేషన్ (ఎన్బిసిసి)తో బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఒప్పందం కుదుర్చుకున్నది.
వైసిపి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా ఇతర పార్టీల నేతలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానం బిల్డ్ ఏపి కాదు సేల్ ఏపిలా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. నవరత్న పథకాల అమలు కోసం ప్రభుత్వ భూములను, యూనివర్శిటీ స్థలాలను అమ్మాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని వామపక్షాల నేతలు రామకృష్ణ, మధులు అంటున్నారు. తక్షణం ప్రభుత్వస్థలాలను అమ్మే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల భూములను సేకరిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై పునరాలోచన చేస్తుందా లేక ముందుకే వెళుతుందా వేచి చూడాల్సి ఉంది.