అమరావతి : తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త శేఖర్రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థాన పాలకవర్గ ప్రత్యేక ఆహ్వానితుల్లో ఒకరుగా జగన్ ప్రభుత్వం నియమించడం వివాదాస్పదం అవుతోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇదే శేఖర్రెడ్డిని టిటిడి బోర్డు డైరెక్టర్గా నియమించినపుడు ఆయనకు ఉన్న అర్హత ఏమిటని వైసిపి నేతలు ప్రశ్నించారు. చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్గా ఉన్న పాలకమండలిలో శేఖర్రెడ్డి డైరెక్టర్గా నియమితులయ్యారు.
నోట్ల రద్దు అనంతరం 2016లో చెన్నైలోని శేఖర్రెడ్డి నివాసంలో ఐటి శాఖ దాడులు చేయగా భారీ ఎత్తున నగదు, బంగారం బయపడ్డాయి. ఆయనపై ఐటి శాఖతో పాటు సిబిఐ కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ పరిమాణాలతో చంద్రబాబు ప్రభుత్వం శేఖర్రెడ్డితో టిటిడి బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయించింది.
ఈ నేపథ్యంలో అప్పుడు వైసిపి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేష్, శశికళకు శేఖర్ రెడ్డి బినామీ అంటూ నాడు వైసిపి అధికార ప్రతినిధి, ప్రస్తుత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. లోకేష్కు వంద కోట్ల రూపాయలు ఇవ్వడం వల్లనే ఆయనను టిటిడి డైరెక్టర్ పదవికి ఎంపిక చేశారంటూ అంబటి ఆరోపించారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా శేఖర్రెడ్డి నియామకాన్ని తప్పుబట్టారు. ‘టిటిడి బోర్డు మెంబర్గా ఉన్న శేఖరరెడ్డి వందల కోట్ల అవినితి సొమ్ముతో సిబిఐకి దొరికిపోయాడు. ఈ శేఖర్ రెడ్డి బాబు బినామీ. అందుకే ఆయనను 2014లో బాబు టిటిడి బోర్డు మెంబర్గా నియమించారని చిత్తూరు జిల్లా ప్రజలే అంటున్నారు. కాగా బయట పడని బాబు బినామీలు ఇంకా చాలా మందే ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని వైఎస్ జగన్మోహనరెడ్డి 2016 డిసెంబర్ 12న తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆరోపించారు. అంత భారీ స్థాయిలో వైసిపి నేతల విమర్శలు ఎదుర్కొన్న శేఖర్రెడ్డిని ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో టిటిడి పాలకమండలి ఆహ్వనితులుగా నియమించడంపై ఇటు ప్రతిపక్ష పార్టీలతో పాటు నెటిజన్లు సోషల్ మీడియాలో అధికార పక్షాన్ని విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే జగన్మోహనరెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో ఆయన పేరు శేఖర్రెడ్డిగా పేర్కొనకుండా శేఖర్ ఎజె, ప్రెసిడెంట్ ఎల్ఒసి, చెన్నై అని పేర్కొన్నారు. దీనిని కూడా నెటిజన్లు విమర్శిస్తున్నారు. పేరు మార్చి జివో ఇస్తే కనుక్కోలేమనుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నాడు శేఖర్రెడ్డిపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల వీడియాను ట్యాగ్ చేస్తూ టిడిపిది – వైసిపిది ఒకటే బతుకు చిల్లర బతుకు అని అంబటే తేల్చి చెప్పారు అంటూ ట్వీట్ చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలపై అధికార పక్షం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
https://www.facebook.com/photo.php?fbid=10211578875546143&set=a.1423775453060&type=3
https://twitter.com/JspVaraPrasad/status/1175041530597240832
https://www.facebook.com/JustFuSuCk/posts/556007675139906