(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
టెరరిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సహచరుడి కుమారుడిని ఎత్తుకుని ఆ అమర వీరుడికి నివాళులు అర్పిస్తూ దుఖాన్ని ఆపుకోలేకపోయిన ఓ సీనియర్ పోలీసు అధికారి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత బుధవారం జమ్ము కాశ్మీర్, అనంతనాగ్ వద్ద టెరరిస్టులు జరిపిన దాడిలో అయిదుగురు సిఆర్పిఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోయారు. అనంతనాగ్ పట్టణం, సదర్ పోలీసు స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న అర్షద్ ఖాన్ దాడిలో గాయపడ్డారు. ఆయన ఆదివారం ఢిల్లీలోని అఖిల భారత వైద్యశాస్త్రాల సంస్థ ఆసుపత్రిలో మరణించారు.
సోమవారం అర్షద్ ఖాన్కు శ్రీనగర్ జిల్లా పోలీసు కేంద్రంలో నివాళులు అర్పిస్తున్న సందర్భంలో ఖాన్ నాలుగేళ్ల కుమారుడు ఉబాన్ను ఎత్తుకుని సహచరుడి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచిన శ్రీనగర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ హసీబ్ మొగల్ ఉద్వేగం ఆపుకోలేక దుఖించిన క్షణం ఫొటోలో బందీ అయింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.