గుంటూరు: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆయన మేనత్త కుమారుడు కంచేటి సాయి బాబు సందేహం వ్యక్తం చేశారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని పేర్కొన్నాడు.కోడెలను ఆయన కుమారుడు శివరామే హత్యచేయడమో లేక హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు తమకు అనుమానంగా ఉందని సాయి పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో కోడెల కుమారుడు శివరాంపై ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా శివరాం కోడెలను వేధిస్తున్నాడని, కోడెలకు ఆత్మహత్య చేసుకునే అవసరమే లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను మానసికంగా కోడుకు వేధిస్తున్నాడని తనతో ఎన్నో సార్లు కోడెల చెప్పినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సాయి వెల్లడించారు. తండ్రిని ఇబ్బంది పెట్టొద్దని పలుసార్లు శివరాంకు చెప్పినా వినలేదని, కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించినా కుదరలేదని కంచి సాయి తన ఫిర్యాదులో వివరించారు.