రెండు నెలలుగా లాక్ డౌన్ కొనసాగుతుంది. లాక్ డౌన్ అమలు నాటికి, ఇప్పటికీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మే నెలలోనే చూసుకుంటే… మే మొదటి రోజున దేశవ్యాప్తంగా 35 వేలు కేసులు ఉండగా…, ప్రస్తుతం 1.38 లక్షలకు చేరాయి. గడిచిన వారం రోజులుగా రోజుకి 6 వేలు దాటి కేసులు నమోదవుతున్నాయి. ఇది జూన్, జులైలో మరింత తీవ్రం కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ లో రానున్న రెండు నెలల్లో పరిస్థితి దారుణంగా ఉండనుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసుల కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. కానీ, ఆర్థికపరమైన ఆందోళనలు దశలవారీ సడలింపులకు కారణమయ్యాయి. మొదట లాక్డౌన్, తరవాత సడలింపులతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఆ దేశాల్లో ఇలా పెరుగుదల…!
మార్చి నెలలో ఇరాన్లో భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో వాటి కట్టడికి అక్కడి ప్రభుత్వం అనేక నిబంధనలను విధించింది. తరవాత ఏప్రిల్లో కేసులు తగ్గడం, కోలుకునే వారి సంఖ్య పెరగడంతో సడలింపుల వైపు మొగ్గు చూపింది.
ఇప్పుడు రెండో సారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం లాక్డౌన్ తదనంతర పరిణామాలకు నిదర్శనం. ఇప్పటికే వైరస్ ప్రభావంతో అల్లకల్లోలమైన స్పెయిన్, బ్రిటన్ దేశాలు కొద్దిగా నిబంధనలు సడలించాయి. అక్కడ మరోసారి కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. దక్షిణ కొరియాది దాదాపు ఇదే పరిస్థితి. అక్కడ బార్లు, క్లబ్బులకు అనుమతి ఇచ్చారు. కానీ, అక్కడ కొన్ని క్లబ్బుల కారణంగా వందల సంఖ్యలో కొత్త కేసులు వచ్చాయి. కరోనాను దాదాపుగా కట్టడి చేశామని చెప్పిన చైనాలోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఇదిలా ఉండగా, రెండు నెలల లాక్డౌన్ తరవాత కూడా భారత్లో వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘బిహార్లో కేర్ ఇండియా’ బృందానికి నాయకత్వం వహిస్తున్న అంటువ్యాధుల నిపుణులు తన్మయ్ మహాపాత్ర కేసుల సంఖ్య పెరగడానికి పరీక్షల సంఖ్య పెరగడం కూడా కారణం కావొచ్చన్నారు. అలాగే ఇప్పటి వరకు కేసులు నమోదు కానీ ప్రాంతాల్లో కూడా పరీక్షలు నిర్వహించాలని, దాని ద్వారా లక్షణాలు కనిపించకుండా వైరస్ వ్యాప్తి చేసే వారిని గుర్తించవచ్చన్నారు. గత వారం రోజులుగా పెరుగుతున్న కేసుల సంఖ్యకు సడలింపులను కారణంగా చెప్పలేమని, ఆ ప్రభావం రానున్న రోజుల్లో తెలుస్తుందని చెప్పారు. ‘భారత్ను ఎప్పటికీ లాక్డౌన్లో ఉంచలేం. కొన్ని సడలింపులు ఇవ్వడం చాలా అవసరం. దానర్థం ప్రజలు ఎప్పటిలాగే ప్రయాణాలు చేయొచ్చని కాదు.
స్వతంత్ర అప్రమత్తత ముఖ్యం.. !
లాక్ డౌన్ కొనసాగిస్తే ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. తీసేస్తే జనం విపరీతంగా తిరుగుతూ వైరస్ బారిన పడతారని ఆందోళన. అందుకే కేంద్రం దశలవారీగా సడలింపులు ఇస్తూ మధ్యస్థం గా ఉంటోంది. కానీ మన దేశంలో కరోనా తీవ్రత పరంగా మనం ఇంకా దారుణ స్థాయికి చేరలేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఏప్రిల్, మే కంటే జూన్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. జులైలో తార స్థాయికి చేరుకొనే అవకాశం ఉంది’ అని వెల్లడించారు. అంటే ప్రస్తుతం రోజుకి 6 వేలు కేసులు నమోదవుతుండగా.., జూన్, జులై నెలలో రోజుకి 15 వేల వరకు చేరే వీలుందని తెలుస్తోంది. అందుకే అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు మానసికంగా ప్రజలను సిద్ధం చేసి పనిలో ఉన్నాయి.