రాష్ట్రంలో ఈ నెల 2వ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. కరోనా ఉదృతి నేపథ్యంలో ముందుగా 9,10 తరగతులను నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. తల్లిదండ్రుల అంగీకార పత్రంతో విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు. పాఠశాలలకు రావడానికి భయపడే పిల్లలకు ఆన్ లైన్ ద్వారా పాఠ్యాంశాలు బోధించాలని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది.
అయితే పాఠశాలలు ప్రారంభం అయ్యాయో లేదో రెండు రోజుల వ్యవధిలోనే కరోనా కలకలం ప్రారంభం అయ్యింది. ప్రకాశం, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, విశాఖ, చిత్తూరు జిల్లాలలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిమాణం విద్యార్థుల తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన కల్గిస్తున్నది. ప్రకాశం జిల్లాలో నాలుగు జిల్లా పరిషత్ హైస్కూళ్లలో ఒకే రోజు నలుగురు ఉపాధ్యాయులు, 8మందికి పైగా విద్యార్థులు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా విశాఖలో 46మంది ఉపాధ్యాయులు, నలుగురు సిబ్బంది, ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 8మందికి కరోనా సోకింది. చిత్తూరు జిల్లాలో ఏకంగా 150మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. వీటిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందిస్తూ.. వీరందరికీ పాఠశాలలకు రాకముందే కరోనా సోకి ఉండవచ్చనీ, పాఠశాలలో పరీక్షలు చేసినప్పుడు బయట పడుతున్నాయనీ అంటున్నారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించడంతో పాటు పాఠశాలల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి వెల్లడిస్తున్నారు.
పాఠశాలలు తిరిచి మూడు రోజుల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. కరోనా విపత్తు నేపథ్యంలో పాఠశాలల నిర్వహణపై పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్కు లేఖ రాశారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 150 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా సోకిందన్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ ఏజన్సీ ఏరియాల్లో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఆయన సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పాఠశాలలను ప్రారంభించడం పెను విపత్తుకు దారి తీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పైగా విద్యార్థలు పూర్తి ఆరోగ్య బాధ్యత తల్లిదండ్రులదే అన్న విధంగా రాతపూర్వకంగా లేఖలు తీసుకోవడం తదగన్నారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి ప్రయోగాలు చేయడం మానుకోవాలని రామకృష్ణ ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.