న్యూఢిల్లీ: ‘కరోనా వైరస్’కు కేంద్రంగా ఉన్న చైనాలోని హుబి ప్రావిన్సు నుంచి భారతీయులు శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. కరోనా వైరస్తో చైనా వణుకుతున్న నేపథ్యంలో వూహాన్లోని భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 747 జంబో విమానాన్ని వూహాన్ పంపింది. మొత్తం 350 మంది విద్యార్థులను భారత్కు తరలించాల్సి ఉండగా, అందులో ఆరుగురు తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో ఇమిగ్రేషన్ అధికారులు వారిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీంతో మిగిలిన వారితో విమానం బయలుదేరింది. వూహాన్లో మిగిలిన వారి కోసం మరో విమానాన్ని పంపనున్నట్టు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
హుబి ప్రావిన్సులో మొత్తంలో 600 మందికిపై భారతీయులు ఉండగా.. వీరిలో ప్రస్తుతం 324 మంది భారత్ కు చేరకున్నారు. మరికొంత మందిని తీసుకురావడానికి శనివారం మరో విమానం వెళ్లనుంది. ఇవాళ వచ్చిన విమానంలో ఏపీకి చెందిన 56 మంది ఇంజినీర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు ఉన్నట్లు సమాచారం.
An Air India flight carrying 324 Indian nationals from the coronavirus hit Hubei Province of China took off from Wuhan in the early hours of Feb 1. Majority of the passengers were Indian students. We sincerely thank the Chinese government for facilitating this flight. (1/3)
— India in China (@EOIBeijing) January 31, 2020
చైనా నుంచి తీసుకొచ్చిన భారతీయుల కోసం హర్యానాలోని మానేసర్ సమీపంలో భారత సైన్యం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వారికి స్క్రీనింగ్ రెండు దశల్లో జరగనుంది. తొలుత ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరీక్షిస్తారు. అనంతరం మానేసర్ కేంద్రానికి తరలించి క్షుణ్నంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరికైనా కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తమైతే.. వారిని వెంటనే బేస్ హాస్పిటల్ ఢిల్లీ కంటోన్మెంట్(బీహెచ్ డీసీ)కు తరలిస్తారు. జ్వరం, దగ్గు, శ్వాసకోశ సంబంధిన సమస్యలు ఉన్నవారిని బీహెచ్ డీసీకి పంపుతారు. వైరస్ సోకిన లక్షణాలు లేనివారిని కూడా మానేసర్ లోనే ఉంచుతారు. వారికి ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 14 రోజుల తర్వాత కూడా వారిలో వైరస్ లక్షణాలేవీ కనిపించకపోతే స్వస్థలాలకు పంపిస్తారు.
మరోవైపు కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 260కి చేరింది. మరో 12 వేల మందికి ఈ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరిలో 1800 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. వైరస్ కేంద్రంగా ఉన్న హుబి ప్రావిన్సు నుంచి తమ పౌరుల్ని సొంత దేశాలకు తీసుకెళ్లేందుకు అన్ని దేశాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. వైరస్ తీవ్రత నేపథ్యంలో ‘అంతర్జాతీయ ఆత్యయిక స్థితి’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది.