(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కరోనా వైరస్ భయంతో ఇటలీలో ఒక విలాస నౌక (క్రూజ్ షిప్)ను దిగ్బంధించారు. ప్రపంచంలోని భారీ క్రూజ్ షిప్లలో అయిదవ స్థానంలో ఉన్న కోస్టా స్మెరాల్డా నౌక ఇటలీలోని సివిటావెచ్చియా పోర్టులో గురువారం ఆగినపుడు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నౌకలో కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్న ఇద్దరు చైనీయులను అందులోని ఆసుపత్రిలో ఏకాంతంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇద్దరూ జనవరి 25న హాంకాంగ్ నుంచి విమానంలో మిలన్ నగరానికి వచ్చి అక్కడ క్రూజ్ షిప్ ఎక్కారు. క్రూజ్ షిప్లో మొత్తం 7 వేల మంది ప్రయాణికులు ఉన్నారు.
హాంకాంగ్ నుంచి వచ్చిన ఇద్దరిలో 54 ఏళ్ల మహిళకు జ్వరం, ఇతర కరోనా లక్షణాలు కనబడడంతో ఆ ఇద్దరినీ మిగతా ప్రయాణికుల నుంచి వేరు చేశారు. సివిటావెచ్చియా పోర్టులో ముగ్గురు ఇటాలియన్ వైద్యులు, ఒక నర్సు నౌకలోకి ప్రవేశించి పరీక్షల కోసం ఆ ఇద్దరి రక్తం శాంపిళ్లు తీసుకువెళ్లారు. పోర్టు అధికారులు మళ్లీ చెప్పేంతవరకూ నౌక నుంచి ఎవరూ కిందకు దిగడానికి లేదు. బయటివారు నౌకలోకి ప్రవేశించడానికి లేదు.
చైనాలో మొదట బయటపడిన కొత్త రకం వైరస్ కరోనా ఇప్పటివరకూ 133 మంది మరణాలకు దారి తీసింది. ఈ వైరస్ క్రమంగా 15 దేశాలకు పాకింది. ఇంతవరకూ తెలియని వైరస్ కావడంతో దీని ఇన్ఫెక్షన్కు ఎలా చికిత్స అందించాలో తెలియడం లేదు. మొదట ఈ వైరస్ బయటపడినపుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లు వ్యవహరించింది. క్రమేపీ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు తేలడంలో ఇప్పుడు కరోనాను ప్రపంచ ఎమర్జెన్సీగా ప్రకటించాల్సిన అవసరం ఉందేమోనని పరిశీలిస్తున్నది.