(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రపంచాన్ని భయపెడుతున్న ‘కరోనా వైరస్’వూహాన్లోని జంతుమాంసం విక్రయించే మార్కెట్ నుంచి వ్యాపించలేదా? చైనా తయారు చేసిన జీవాయుధం (బయో వెపన్) ప్రయోగశాలలో ఉండాల్సిన ఆ వైరస్ పొరపాటున బయటి ప్రపంచంలోకి వచ్చి విస్తృతంగా వ్యాపిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా వైరస్ కారణంగా చైనాలో 130 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ఎక్కడ తమ దేశంలోకి ప్రవేశిస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైరస్ జంతుమాంసం విక్రయించే మార్కెట్ నుంచి పుట్టిందని తొలుత చైనా వెల్లడించింది. కానీ అందులో నిజం లేదని ఇజ్రాయెల్కు చెందిన డానీ షోహమ్ అనే మైక్రోబయాలజిస్టు అంటున్నారు.
చైనా తన యుద్ధ వ్యూహాల్లో భాగంగా వూహాన్లోని వైరాలజీ ఇన్స్టిట్యూట్లో జీవాయుధాలను తయారుచేస్తోంది. అయితే, రసాయనిక, జీవాయుధాల తయారీపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉంది. వాటివల్ల శత్రు దేశ సైనికులకే కాక సామాన్యులకు కూడా ముప్పు ఉంటుంది కాబట్టి ఈ నిషేధం. కానీ, కొన్ని దేశాలు తమ బయొలాజికల్ వార్పేర్లో భాగంగా రహస్యంగా ఈ తరహా వైర్సలను తయారు చేస్తున్నాయనే అనుమానం ఉంది. చైనా కూడా ఇలాగే చేస్తోందని.. ఈ వైర్సను తయారుచేస్తున్న ల్యాబ్ వూహాన్లోనే ఉందని డానీ షోహమ్ ఆరోపిస్తున్నారు. ‘వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ చైనా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించిన బయోసేఫ్టీ లెవెల్ 4గా వ్యవహరించే వైరాలజీ కేంద్రం. కరోనా వంటి వైరస్లను నియంత్రించేందుకు పరిశోధనల కోసం 2018లో దీన్ని నిర్మించారు. అక్కడ చైనా తన జీవాయుధ కార్యక్రమంలో భాగంగా కరోనా వైరస్లతోపాటు, ఎబోలా, నిపా వైరస్ తదితర సూక్ష్మజీవులపై పరిశోధనలు చేస్తోందని డానీ షోహమ్ చెప్పారు. ఈ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటకు లీకైందనే ఆరోపించారు.. కరోనా వైరస్ చైనాలోని వుహాన్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతానికి అతి దూరంలోనే వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోసేఫ్టీ లాబోరేటరీ ఉండటం అనుమానాలకు తావిచ్చింది.
మరోవైపు కరోనా వైరస్ తమ తప్పేనని చైనా అంగీకరిస్తూ క్షమాపణ చెప్పబోతోందని చైనీస్ కోటీశ్వరుడు గుయోకు చెందిన పత్రిక ఒకటి సంచలన కథనాన్ని ప్రచురించింది. చైనా కావాలనే ఈ వైరస్ ను లీక్ చేసిందనే అనుమానం వచ్చేలా కొన్ని ప్రశ్నలు కూడా సంధించింది. అయితే, గుయో ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని.. ఆయన కావాలనే ఇలా అసత్య కథనాలు ప్రచారం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వైరస్ టీకాను తయారు చేస్తున్నట్టు అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ హెల్త్ అధికారి ఆంథోనీ తెలిపారు. ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో సూచించింది. కరోనా వైరస్ వ్యాపించే ముప్పు అధికంగా ఉన్న 30 దేశాల్లో భారత్ కూడా ఉందని యూకేకు చెందిన సౌథాంప్టన్ వర్సిటీ అధ్యయనంలో తేలింది.
కరోనా చైనా జీవాయుధం అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి దీనికి వుహాన్లో ప్రయోగశాలే కారణమని తాను నమ్మడం లేదని ఆస్ట్రేలియా డిఫెన్స్ అనలిస్ట్ డాక్టర్ మాల్కమ్ డేవిస్ ట్వీట్ చేశారు. కానీ బయో సైన్స్లో చైనా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుండటం, నైతికతకు కట్టుబడి ఉండని దాని వైఖరి అనుమానాలకు తావిస్తోంది. చైనా కరోనా వైరస్ విషయంలో నోరు మెదపకపోవడంతో అనుమనాలు మరింతగా పెరుగుతున్నాయి.
Obviously I'm following the 2019-nCoV #WuhanOutbreak quite closely. I'm not convinced that there is evidence yet to support the theory that this BL-4 R&D facility in #Wuhan is responsible for the #coronavirus outbreak. It's proximity is interesting though. https://t.co/NngrK67QJO
— Dr. Malcolm Davis (@Dr_M_Davis) January 25, 2020
ఇదిఇలా ఉంటే.. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటి వరకు వ్యాధి కేంద్రంగా ఉన్న వుహాన్ లోనే నమోదైన మరణాలు తాజాగా ఆ దేశ రాజధాని బీజింగ్ కు పాకాయి. చైనాలోని మొత్తం పది నగరాల్లో ప్రజా రవాణా నిలిచిపోయింది. చైనాలో గత డిసెంబరులో తొలి కరోనా వైరస్ కేసు వుహాన్ లో బయటపడింది. ప్రస్తుతం వుహాన్ నగరంలో ఉన్న 11 మిలియన్ల మంది ప్రజలను నగరం వరకే పరిమితం చేశారు. వీరి ద్వారా ఇతర ప్రాంతాలకు మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చైనాలో 130 మందికిపైగా చనిపోయారు. సుమారు ఆరు వేల మంది ఈ ప్రమాదకర వైరస్ బారిన పడినట్టు గుర్తించారు. చైనాలో ప్రత్యేకంగా కరోనా వైరస్ బాధితుల కోసమే యుద్ధప్రాతిపదికన వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నారు.