బీజింగ్: చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన ‘కరోనా వైరస్’ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గురువారం ఉదయం నుంచి వుహాన్ నగరంలో ప్రజా రవాణా సర్వీసులను అధికారులు నిలిపివేశారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాన్ని మూసివేశారు. వుహాన్ నగర వాసులు తప్పనిసరై ఇళ్ల నుంచి బయటకు వస్తే మాస్కులు కచ్చితంగా ధరించాలని అధికారులు సూచించారు.
శ్వాస వ్యవస్థపై ‘కరోనా వైరస్’ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ‘కరోనా వైరస్’ కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 571 కేసుల నమోదయ్యాయి. ఈ వైరస్ మనిషి నుంచి మరో మనిషికి కూడా సోకుతుందని వైద్యుల హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరస్ మొదటిసారిగా బయటపడిన వుహాన్ నగరంలో ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేశారు. ఇక్కడి ప్రజలు నగరం నుంచి బయటకు వెళ్లకుండా, బయటి వ్యక్తులు వుహాన్ నగరంలోకి రాకుండా విమానాలు, రైళ్ల రాకపోకలను ఆపేశారు. ఫ్రిబవరి 8 వరకు ఎటువంటి పర్యటనలు చేపట్టొద్దని స్థానిక టూరిజం ఏజెన్సీలను అధికారులు ఆదేశించారు. ఈ నెల 24 నుంచి వారం రోజుల పాటు చైనాలో నూతన సంవత్సర సెలవులు రానుండటంతో ఆ సమయంలో లక్షల మంది ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో వ్యాధి తీవ్రత పెరుగుతుందని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
చైనాలోని వుహాన్, దాని పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదైన సంగతి తెలిసిందే. ఈ వైరస్ ఇప్పటికే వందలాది మందికి సోకి, ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశ రాజధాని బీజింగ్, షాంఘైతోపాటు చైనాలోని ఇతర ప్రావిన్సులలోని ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. దేశం వెలుపల హాంకాంగ్, జపాన్, కొరియా, థాయ్ లాండ్, అమెరికాలోనూ కరోనా కేసులు వెలుగు చూశాయి.
చైనాలోని వుహాన్లో గల సముద్ర జీవుల విక్రయ మార్కెట్ లో విక్రయించిన జంతువుల ద్వారా ఈ వైరస్ వ్యాపించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్లో ఇద్దరు మృతిచెందడంతో వెంటనే వీరి శాంపిల్స్ ను లండన్ కు పంపించి పరిశోధనలు చేపట్టారు. అక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి.. ‘కరోనా వైరస్’గా గుర్తించారు.