న్యూఢిల్లీ: దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని, దాన్ని రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు ఆగితేనే, పౌరసత్వ సవరణ చట్టం వర్తింపు అంశంపై పిటిషన్లు విచారిస్తామని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. రాజ్యాంగం చట్టబద్ధతను అనుమానించేవిగా ఉండకూడదని పేర్కొన్నారు. ఇలాంటి పిటిషన్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిపారు.
సీఏఏపై తప్పుదోవ పట్టించే ప్రచారం జరుగుతోందని న్యాయవాది వీనత్ ధండా అన్నారు. సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్న కార్యకర్తలు, విద్యార్థులు, మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఏఏని రాజ్యాంగబద్దమైనదిగా ప్రకటించి, అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. అయితే దీనిపై అత్యవరస విచారణకు జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నిరాకరించింది. పార్లమెంట్లో ఆమెదించిన ఓ చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమని ఎలా ప్రకటిస్తారని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ప్రస్తుతం శాంతిని నెలకొల్పేందుకే ప్రయత్నించాలన్నారు. పౌరసత్వ చట్టంపై దేశంలో ఆందోళనలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ అంశంపై పిటిషన్లను విచారిస్తామని కోర్టు తెలిపింది. చట్టం చెల్లుబాటును నిర్ధారించడం కోర్దు విధి అని, అంతేగానీ అది రాజ్యాంగబద్ధమైందని తాముప్రకటించలేమని ధర్మాసం పేర్కొంది.
ఇదిలా ఉంటే.. సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 60 పిటిషన్లు దాఖలు అయ్యాయి. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ లలో మత పరమైన పీడనకు గురైన అక్కడి మైనార్టీలకు భారత్ లో పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో రూపొందించిన చట్టానికి గతేడాది డిసెంబర్ లో పార్లమెంటు ఆమోదం తెలిసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.