కరోనా అనే ప్రాణాంతక వైరస్ భయాన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కోట్లు గణించడానికి వినియోగించుకుంటున్నాయా? కరోనా సోకినా, సోకిందన్న భయంతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరి లక్షలకు లక్షలు అనవసరంగా ఖర్చు పెడుతున్నారా?
కార్పొరేట్ ఆస్పత్రులు, మెడికల్ మాఫియా బరితెగించి కరోనా విషయంలో కేవలం సంపాదనకే చూస్తున్నాయా? విజయవాడ స్వర్ణ ప్యాలస్ హోటల్ లో ఉన్నది ఎవరు? ఎంత మంది? వాళ్ళలో కరోనా పాజిటివ్ ఎంత మందికి? సాధారణ జ్వరం లక్షణాలు ఎంతమందికి? కరోనా లేకపోయినా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎందరు? ఇలా వీస్తూ పోయే కొన్ని నిజాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సాక్షాత్తు ఏపీ ప్రభుత్వ అధికారే ఈ విషయాలను గమనించి పూర్తిగా తెలుసుకొని స్వయంగా ప్రకటించారు. యావత్ రాష్ట్రంలోనూ ఆశ్చర్యపోయే విషయాలను, కరోనా మాటున జరుగుతున్న మెడికల్ మాఫియాను బయట పెట్టారు. అవి ఏమిటో తెలుసుకుందాం రండి.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో ఐదుగురికి మాత్రమే కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. మృతుల్లో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. మిగిలిన అందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనిని బట్టి చూస్తే సాధారణ జ్వరం లక్షణాలు కనిపించినా ఇన్ పేషెంట్ గా చేర్చుకొని కరోనా ట్రీట్మెంట్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు డబ్బులు దండుకుంటున్నారు అని అర్ధం అవుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
కరోనా విషయంలో ఒక్కో ఆసుపత్రి లో ఒక్కో విధంగా చికిత్స ధరలు వసూలు చేస్తున్నారు. బెడ్ చార్జీల పేరిట రోజుకు వేల రూపాయలు వసూలు చేయడమే కాకుండా వెంటిలేషన్, ఆక్సీజన్ లకు ప్రత్యేక చార్జీలు తీసుకుంటున్నారు. అధికారుల తనిఖీ ల్లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ బండారం బయట పడుతున్నది. కరోనా బాధితుల నుండి లక్షలాది రూపాయలు వాసులు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంగిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కోవిడ్ 19 ఏపీ కమాండ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సీ ప్రభాకర్ రెడ్డి పలు సూచనలు జారీ చేశారు. కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మూడు రోజుల పాటు జ్వరం, ఆయాసం ఉండి ఆక్సీజన్ శాతం 93 కంటే తక్కువగా ఉంటే 104కి కాల్ చేసి ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. కరోనా భయంతో ఆయాసం ఉన్నప్పటికీ ఆక్సీజన్ శాతం 94 కంటే ఎక్కువగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంట్లో ఉండే వైద్యం పొందవచ్చని ఆయన అన్నారు. భయపడి డబ్బులు వృధా చేసుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యమే నయమని ప్రభాకర్ రెడ్డి అన్నారు.