(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఇకపై ఆవులు చలికోట్లతో దర్శనమివ్వనున్నాయి. గోసంరక్షణకు బిజెపి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా చలికాలం కావడంతో గోశాలల్లోని గోవులకు చలికోట్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
చలి నుండి ఆవులను కాపాడేందుకు జనపనారతో చేసిన కోట్లను కొనుగోలు చేయడానికి అయోధ్య మున్సిపల్ కార్పోరేషన్ రంగం సిద్ధం చేసింది. దూడల కోసం ప్రత్యేకంగా మూడు పొరలు ఉండే కోట్లను కొనుగోలు చేయనున్నారు.
ఆయోధ్య మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ నీరజ్ శుక్లా ఈ సందర్భంగా మాట్లాడుతూ చలి నుండి ఆవులను కాపాడేందుకు జనపనారతో తయారు చేసిన కోట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ పథకం నగర వ్యాప్తంగా మూడు లేదా నాలుగు విడతల్లో అమలు చేయనున్నామన్నారు. తొలి విడతగా జైశింగ్పూర్లోని గోశాలలో వీటిని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఒక్కోకోటుకు 250 రూపాయల నుండి 300 రూపాయల వరకూ ఖర్చవుతోందని ఆయన తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయలు ఇందు కోసం కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. గోవుల సంరక్షణే కార్పోరేషన్ లక్ష్యమనీ, ఇప్పటికే నగరంలో ఎన్నో గోశాలలు ఏర్పాటు చేశామనీ శుక్లా అన్నారు. రాష్ట్రంలోనే అత్యుత్తమమైనవిగా ఇవి గుర్తింపు పొందాయని ఆయన తెలిపారు.