గుంటూరు: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. రాజకీయ విలువలు తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో నడి రోడ్డుపై రాజకీయ వ్యభిచారి జరుగుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, ఎన్సిపి, శివసేన పార్టీల కలయిక కూడా అపవిత్రమైనదేనని వ్యాఖ్యానించారు. శత్రువులుగా పోటీ చేసి ఫలితాల తరువాత అధికారమే పరమావధిగా పొత్తులు పెట్టుకోవడం హేయమైన చర్య అని నారాయణ పేర్కొన్నారు. పార్టీ మారిన అభ్యర్థులకు ఆ క్షణమే వారి పదవి రద్దు చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
పవార్ – మోది చేసుకున్న ఒప్పందంలో భాగంగానే ఈ కలయిక సాధ్యమైందని అన్నారు. ఎంతటి అవినీతి పరులైనా బిజెపితో కలిస్తే పవిత్రులు అవుతున్నారని నారాయణ దుయ్యబట్టారు. ఇలాంటి అపవిత్రమైన రాజకీయాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.