అమరావతి: శ్రీశైలం ఆనకట్ట మరమ్మత్తులకు తక్షణం చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు. ఆనకట్టకు పగుళ్ళు ఏర్పడ్డాయనీ, ప్రమాదం పొంచి ఉందనీ వాటర్ మాన్, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ చెప్పారని రామకృష్ణ గుర్తు చేశారు.
డ్యామ్ పూర్తి నీటి నిలువ సామర్థ్యం 263 టిఎంసిలు కాగా కుడి వైపు 770 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కేంద్రం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సాగు నీరు అందుతోంది.శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు తగు సిబ్బందిని నియమించి తక్షణం ఆనకట్ట మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా ప్రాజెక్టుకు, డ్యామ్ భద్రతకు ఎటువంటి ముప్పు లేదని ఏపి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. నీటి పారుదల శాఖ అధికారులతో ప్రాజెక్టుకు సంబంధించిన నివేదిక తెప్పించుకున్నామనీ, డ్యామ్ రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాజెక్టుల నిర్వహణపై నిర్లక్ష్యం అంటూ ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజల్లో లేనిపోని అనుమానాలు అపోహాలు కల్పించవద్దని మంత్రి అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.