(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన మద్దుతును సీపీఐ వెనక్కి తీసుకుంటుందా? అంటే తాజాగా అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్ 1న టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన ఎర్రదండు.. ఇప్పుడు ఈ విషయంలో పునరాలోచన చేయనుందట. తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై సీపీఐ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే హుజూర్నగర్ ఉపఎన్నిక మద్దతుపై పునరాలోచన చేస్తామని ఆ పార్టీ తాజాగా ప్రకటించింది. కేసీఆర్ వెంటనే ఆర్టీసీ నాయకులతో చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని, ఆ పని కేసీఆర్ ఎందుకు చేయడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాల తొలగింపు అనే ప్రకటనను కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే హుజూర్నగర్ మద్దతుపై సీపీఐ పునరాలోచన చేస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం దొరల రాజ్యం కాదన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు ఒంటరిగా లేరని, తెలంగాణ మొత్తం కార్మికుల వెనుక ఉందని చడా వెంకటరెడ్డి చెప్పారు.
మొన్నటి వరకు సమ్మె వేరు, టీఆర్ఎస్ కు మద్దతు వేరు అని చెప్పిన చాడ.. సమ్మె తీవ్రరూపం దాల్చడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులూ ఉండరు. మారిన పరిస్థితులకు తగ్గట్టు హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రజాసమస్యలపై పోరాటమంటేనే ముందుండే ఎర్రజెండా పార్టీలు.. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తొలుత ఎక్కడా కనపడ లేదు. తాము సమ్మె చేస్తుంటే సంఘీభావం తెలుపకుండా, టీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపి సిద్ధాంతాలకు నీళ్లొదిలారని కార్మికులు సీపీఐపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ తో పొత్తు విషయంపై మరోసారి పునరాలోచన చేయాలని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు.
మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ కోరుతూ ఆర్టీసీ కార్మికులు గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె కారణంగా బస్సులు రోడ్డుపైకి రావడం లేదు. దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులు తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు రవాణా ఇబ్బందులు దూరం చేసేందుకు తాత్కాలిక డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ బస్సులను నడిపిస్తున్నా.. అవి నామమాత్రంగానే కనిపిస్తున్నాయి.
ఇదిఇలా ఉంటే.. సమ్మె చేస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, 48 వేలమందిని ఒక్కసారిగా విధుల నుంచి తొలగించడం అంటే మాములు విషయం కాదు. న్యాయపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వ బెదిరింపులకు లొంగేది లేదని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. తమ సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో తెలంగాణ బంద్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అశ్వద్ధామ రెడ్డి పేర్కొన్నారు.