(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆ ఆపరేషనే ఒక అద్భుతం. వైద్యశాస్త్రపరంగా చూస్తే తల అతుక్కుని పుట్టే పిల్లలను విడదీసే సర్జరీ సక్సెస్ కావడం చాలా అరుదు. గత 50 ఏళ్లలో ప్రపంచం మొత్తం మీద పది పదిహేను మంది మాత్రమే ఈ సర్జరీ తర్వాత బతికి బట్ట కట్టారు. ఆ అరుదైన మృత్యుంజయుల జాబితాలోకి ఇప్పుడు మన ఒదిషా కవలలు ఎక్కారు.
తలలు, అందులో ఉన్న మెదడుతో సహా అతుక్కుని పుట్టే కవలలను వైద్యశాస్త్ర పరిభాషలో క్రేనియోపేగస్ కవలలు అంటారు. ఒదిషాకు చెందిన జగ్గా, బలియా అలాంటి కవలలు. వారిని వేరు చేయడానికి 2017 జూలై 14న ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థలో చేర్చారు. వారిని విడదీసే సర్జరీ ప్రక్రియలో వైద్యులు గానీ, సపోర్ట్ సిబ్బంది గానీ మొత్తం 125 మంది పాలుపంచుకున్నారు.
ఆపరేషన్ విజయంవంతగా చేయడం ఒక ఎత్తు అయితే విడదీసిన తర్వాత ఆ పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ఒక ఎత్తు. మొత్తం 75 మంది డాక్టర్లు, 50 మంది నర్సులు రాత్రింబవళ్లు జగ్గా, బలియాను కనిపెట్టుకుని వారిని కాపాడారు. రెండేళ్ల తర్వాత శుక్రవారం వారు ఒదిషాకు బయలుదేరి వెళ్లారు. అక్కడ మొదట కటక్లోని ఎస్.సి.బి వైద్య కళాశాలలో కవలలను చేరుస్తారు. రైలులో వారితో పాటు ముగ్గురు వైద్యులు, ఒక నర్సు వెళ్లారు. ఇండియాలో క్రేనియోపేగస్ కవలలను విజయవంతంగా విడదీయడం ఇదే మొదటిసారి.