అమరావతి: రాజధాని అమరావతిలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చి వేయాలని సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో నివాసాన్ని కూల్చి వేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులకు ఇంటి యజమాని లింగమనేని నుంచి వివరణ రాలేదని… అందుకే మరోసారి నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు. ఈ నోటీసులను చంద్రబాబు నివాసం గోడకు అతికించారు. నిబంధనలకు విరుద్దంగా నదీగర్భంలో ఈ భవనాన్ని నిర్మించారని, అక్రమ కట్టడాలను వారం రోజుల్లోగా తొలగించాలని… లేకపోతే తామే వాటిని తొలగిస్తామని సీఆర్డీఏ జారీచేసిన నోటీసుల్లో పేర్కొన్నారు
రాజధాని అమరావతిలోని ప్రజావేదికతో సహా అక్రమ నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్దంగా ప్రజావేదికను నిర్మించారని పేర్కొంటూ దీనిని జగన్ సర్కారు కూల్చివేసింది. అలాగే కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలకు జూన్లోనే సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం కూడా ఉంది. తాజాగా, మరోసారి చంద్రబాబు ఇంటికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ పరిణామం ఏ మలుపు తిరగబోతోందన్న ఆసక్తి నెలకొంది.
సీఎంగా పనిచేసిన సమయంలో అమరావతి నుంచే పాలన సాగించాలని భావించిన మాజీ సీఎం చంద్రబాబు కుటుంబంతో సహా ఈ ఇంటిలోనే ఉంటూ వచ్చారు. లింగమనేని కట్టించిన ఈ గెస్ట్హౌస్ నివాసయోగ్యంగా ఉండటంతో పాటు సమావేశాలు నిర్వహించడానికి కూడా అనువుగా ఉండటంతో ఇక్కడ ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రకాశం బ్యారేజీకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఈ గెస్ట్ హౌస్ ఉంది. ఈ గెస్ట్ హౌస్లో నాలుగు బెడ్ రూమ్లు, రెండు పెద్ద గదులు, హోం థియేటర్, అప్పటి సీఎం చంద్రబాబు సిబ్బంది ఉండేందుకు అనువుగా కొన్ని గదులు, మినీ కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. ఈ గెస్ట్ హౌస్కు ఆనుకుని ఒకటిన్నర ఎకరాలో హెలిప్యాడ్ ఉంది. ఈ గెస్ట్ హౌస్ను లింగమనేని అక్రమంగా కట్టారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ గెస్ట్ హౌస్ను కూల్చేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది.