శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి సురయ్య అబ్దుల్లా, కుమార్తె సఫియా అబ్దుల్లా ఖాన్లతో పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురయ్య, సఫియా ఆధ్వర్యంలో పలువురు మహిళలు చేతులకు నల్లని బ్యాండ్స్ ధరించి ప్లకార్డులు పట్టుకొని ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. దీంతో వీరు రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు. సిఆర్పిఎఫ్ మహిళా అధికారులు రంగంలోకి వారిని అదుపులోకి తీసుకొని తరలించారు. నిరసన తెలుపుతున్న మహిళలు మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంలో ఆ మహిళలు విడుదల చేసిన ప్రకటనలో కశ్మీర్లోని ప్రజల స్వేచ్ఛను, ప్రాధమిక హక్కులను పునరుద్దరించాలని కోరారు. కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు తమను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370, 35 ఏ లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరించమని తెలిపారు. గృహ నిర్బంధంలో ఉన్న నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులకు విరుద్ధంగా, వాస్తవాలను వక్రీకరించేలా జాతీయ మీడియా కథనాలు ఉంటున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు అయిదున జమ్మ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి జమ్మకశ్మీర్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో సహా పలువురు నేతలను, వేర్పాటువాదులను గృహ నిర్బంధంలో ఉంచారు.