హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారంతో 46వ రోజుకు చేరిన వేళ.. జేఏసీ నేతలు ఎంజీబీఎస్ లో అత్యవసరంగా సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు ప్రతి, భవిష్యత్ కార్యచరణపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు. సమ్మెపై జేఏసీ నేతలు ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. సమ్మె కొనసాగింపు అంశంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని భావించిన కార్మికులు.. కేసును లేబర్ కోర్టులో తేల్చుకోవాలని తీర్పునివ్వడంతో ఒకింత ఢీలా పడ్డారు. ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగించాలా ? వద్దా ? అనే విషయంలో కార్మికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాకుండా 46 రోజులుగా సాగుతున్న సమ్మెకు ముగింపు పలికితే.. ఇన్నిరోజుల సమ్మెకు అర్థం ఉండదని కొందరు జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సమ్మె కొనసాగింపు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేతలు బుధవారం న్యాయవాదులతో భేటీ కానున్నారు. హైకోర్టు తుది ఉత్తర్వులపై న్యాయ సలహా తీసుకోనున్నారు. లేబర్ కోర్టులో కేసు తుది తీర్పు రావడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది ? సమ్మె కొనసాగింపు వల్ల కార్మికులకు లాభమా ? నష్టమా ? అన్న విషయాలను చర్చించనున్నారు. అనంతరం సమ్మెపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.