చెన్నై: పుల్వామా దాడిలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు తమ వంతు సహాయం చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కే) జట్టు ముందుకొచ్చింది.
మరో రెండు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానున్నది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సిబి) మధ్య చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్నది.
ఈ మ్యాచ్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పుల్వామా దాడిలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు సిఎస్కే ప్రకటించింది. ధోనీ చేతుల మీదుగా చెక్ను అందిచనున్నట్లు సిఎస్కే డైరెక్టర్ రాకేశ్ సింగ్ తెలిపారు.
ఇప్పటికే ఐపిఎల్ ప్రారంభ వేడుకులు రద్దు చేసిన బిసిసిఐ ఆ డబ్బును జవాన్ల కుటుంబాలకు అందజేస్తున్నట్లు ప్రకటించింది.
ఇంతకుముందు కూడా పుల్వామా దాడి బాధితుల పట్ల టీం ఇండియా తన దాతృత్వాన్ని చూపింది. కొద్ది రోజుల ముందు ఆసీస్తో జరిగిన మూడో వన్డేలో ఆటగాళ్లకు వచ్చే ఫీజు మొత్తాన్ని జవాన్ల కుటుంబాలకు ఇస్తున్నట్లు టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ ప్రకటించాడు.