లక్నో: సమాజ్వాదీ పార్టీ నాయకుడు, ఎంపీ ఆజాంఖాన్ పై ప్రముఖ సినీనటి, రాంపూర్ మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆజాంఖాన్ వల్ల ఎంతో మంది మహిళలు కన్నీరు పెట్టుకున్నారని… వారి శాపాలు ఆయనకు తగిలాయని జయప్రద విమర్శించారు. మహిళల కారణంగానే ఆయనపై భూ కబ్జా కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందుకే ఆయన ఇప్పుడు ఎన్నికల సభల్లో ఏడుస్తున్నారని జయప్రద మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో జరిగిన ఓ ర్యాలీలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆజాంఖాన్ ఏడ్చారు. ఆ నియోజకవర్గంలో ఆయనపై సుమారు 80 కేసులు నమోదు అయ్యాయి. కోళ్లు, మేకలు ఎత్తుకెళ్లినట్లు కూడా కేసులు పెడుతున్నారని ఆజాంఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాంపూర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల సభలో పాల్గొన్న జయప్రద…ఆజాంకు ఆడవారి కన్నీటి ఉసురు తగిలిందని, అందుకే ప్రతి సభల్లో ఏడుస్తున్నాడని విమర్శించారు. గతంలో తనను ఓ మంచి నటిగా గుర్తించేవాడని, కానీ ఇప్పుడు ఎన్నికల సభల్లో ఆయన తనకంటే బాగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు ఆజంఖాన్ ప్రయత్నించినట్లు జయప్రద ఆరోపించారు.
జయప్రద, ఆజాంఖాన్ మధ్య చాలా కాలం నుంచి రాజకీయ వైరం కొనసాగుతోంది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ… ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో కొనసాగాయి. గతంలో సమాజ్వాదీ పార్టీ తరపున రాంపూర్ ఎంపీగా విజయం సాధించిన జయప్రద… గత లోక్ సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జయప్రదపై ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆజాంఖాన్ గెలిపొందారు.
ఇదిఇలా ఉంటే..రాంపూర్ ఎంపీ ఆజాం ఖాన్ పై పలుసార్లు దొంగతనం కేసులు నమోదయ్యాయి. అది కూడ ఆయన స్వంత నియోజకవర్గంలోనే అవుతున్నాయి. అజాంఖాన్ పై ఇప్పటికే 80 కేసులు నమోదయ్యాయి. వాటిలో ముఖ్యంగా భూకబ్జాల కేసులు ఎక్కువగా ఉన్నాయి.