అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే డ్రగ్స్, సైబర్ క్రైమ్ విశాఖ జిల్లాలోనే అధికంగా ఉందని ఆయన తెలిపారు. వైట్ కాలర్ నేరాలను మాత్రం టెక్నాలజీ సాయంతో అరికట్టామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం రెండో రోజు జరిగింది.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలను సమీక్షించారు. ఈ నేపథ్యంలో డీజీపీ సవాంగ్ మాట్లాడుతూ… 2018లో రాష్ట్రంలో 122268 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అలాగే గతేడాది 880 మర్డర్ కేసులు నమోదయ్యాయి అని తెలిపారు. మావోయిస్టులను అరికట్టేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని అందుకు సంబంధించిన విషయాలను గౌతమ్ సవాంగ్ సోదాహరణగా వివరించారు.
మావోయిస్టులను నియంత్రించడంలో ఏపీ పోలీసులు సఫలీకృతమయ్యామని ఆయన స్పష్టం చేశారు. ఏవోబీలో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలకు ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత సాధ్యమైనంత మేర పెంచుతున్నామన్నారు. ఏపీ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుందని చెప్పారు. దేశంలోని వివిధ నేరపరిశోధనలు, వినూత్న ఆలోచనలకు ఏపీ పోలీస్ విభాగం ప్రమాణాలను నిర్దేశించిందని గౌతమ్ సవాంగ్ వివరించారు.