హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసు దర్యాప్తులో సైబరాబాద్ పోలీసులు వేగాన్ని పెంచారు. ఈ నెలాఖరులో పూర్తి సాక్ష్యాధారాలతో చార్జిషీటును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పొందుపర్చనున్నారు. ఈ కేసులో మొత్తం 30 మంది సాక్షుల స్టేట్మెంట్స్ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. విచారణలో వీరందర్నీ కూడా పోలీసులు ఫాస్ట్ ట్రాక్ లో హాజపర్చే అవకాశం ఉంది. ఇప్పటికే డీఎన్ఏ రిపోర్ట్స్, ఫోరెన్సిక్ నివేదికను పోలీసులు తెప్పించుకున్నారు. అత్యాచారం, హత్య ప్రాంతాల్లో దొరికిన సీసీ ఫుటేజ్ కీలకంగా ఉన్నాయి.
లారీతో పాటు సంఘటన స్థలంలో దొరికిన మద్యం బాటిళ్లు, దిశ ద్విచక్రవాహనంపై ఉన్న వేలిముద్రలను పోలీసులు సేకరించారు. వీటిని నిందితుల అరెస్టు సమయంలో తీసుకున్న వేలి ముద్రలతో సరిపోల్చనున్నారు. దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను క్రోడీకరించుకుని వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించి పోలీసులు చార్జీషీటు దాఖలు చేయనున్నారని సమాచారం.
నవంబరు 27వ తేదిన దిశ హత్యాచారానికి గురయిన సంగతి తెలిసిందే. దిశను టైరు పంక్చర్ అయ్యిందని మాయ మాటలు చెప్పి ఆమెను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసి, శంషాబాద్ నుంచి చటాన్పల్లి ప్రాంతానికి తీసుకువెళ్ళి అండర్పాస్ బ్రిడ్జి వద్ద దహనం చేశారు. ఈ కేసు మిస్టరీని 24 గంటల్లో చేధించిన పోలీసులు.. నిందితులైన అరిఫ్, చెన్నకేశవులు, నవీన్, శివలను గుర్తించి 30వ తేదిన అరెస్టు చేశారు. డిసెంబరు 6న నిందితులు చెప్పిన వాంగ్మూలం ఆధారంగా ఆమె ఫోన్, పవర్ బ్యాంక్, వాచీని రికవరీ చేసేందుకు వెళ్లిన పోలీసులపై తిరగబడి కాల్పులకు దిగడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.
మరోవైపు దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది సుప్రీంకోర్టు. ఆరునెలల్లో విచారణను పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఎన్కౌంటర్కు దారి తీసిన పరిస్థితులతో పాటు ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపైనా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ను నియమించింది.