ఫోని తుపాను తీరం దాటకముందు పూరి పట్టణం
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రచండ తుపాను ఫోని అనుకున్నట్లుగానే ఒదిషా రాష్ట్రం, పూరి వద్ద తీరం దాటింది. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తుపాను తీరాన్ని దాటడం ప్రారంభమయింది. దీని ప్రభావంతో ఒదిషాలో వేరువేరు సంఘటనలలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఫోని ధాటికి పూరి పట్టణంలో చాలా ప్రాతాలు నీట మునిగాయి. చెట్టు కూలిపోయాయి. విద్యుత్తు స్థంభాలు నేలకొరిగాయి. తీవ్రమైన వేగంతో గాలులు, భారీ వర్షం తీరప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. గంటకు 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉత్తరకోస్తా జిల్లాల్లో, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో కూడా గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరం నుండి ఫోనీ అంతకంతకూ దూరం అవుతున్నది కాబట్టి ఆ తీరప్రాంతాలు ముప్పు నుండి త్పపించుకున్నట్లే. అయితే ఉండేకొద్దీ దగ్గరవుతున్న పశ్చిమ బెంగాల్లో ఈ సాయంత్రం నుండి ఫోనీ ప్రభావం కనబడుతుంది. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 48 గంటలపాటు తాను ఎన్నికల ప్రచార సభలు సహా అన్ని కార్యక్రమాలూ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
వాయుగుండంగా మొదలయిన ఫోని అంతకంతకూ శక్తి పుంజుకుని సూపర్ సైక్లోన్గా మారింది. మొదట అంచనా వేసినదానికన్నా కాస్త ముందే ఇది తీరం దాటవచ్చని శాస్త్రజ్ఞులు గురువారం పేర్కొన్నారు. ఆ విధంగానే ఈ ఉదయం పోని తీరం దాటింది. తీరం దాటక ముందు ఈ తుపాను కన్ను (కేంద్రం) 30 కిలోమీటర్ల వ్యాసార్ధంలో ఆవరించుకునిఉంది. ఈ కేంద్రం పూర్తిహగా తీరం దాటడానిక సుమారుగా మూడు గంటల సేపు పట్టింది. ఇది ఉత్తరంగా పయనించి శనివారం ఉదయానికి ఢాకా చేరువలో పూర్తిగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం తీరప్రాంతాల్లో 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 3 నుంచి 6 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడతాయని అంచనా వేస్తున్నారు. పెద్ద స్థాయిలో ప్రాణనష్టానికి దారితీసిన 1999 తుపాను అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఒదిషా రాష్ట్రంలో 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఫోని తుపాను తీరం దాటినపుడు పూరి పట్టణంలో దృశ్యాలను కింద వీడియోలో చూడండి:
video courtesy: india tv