గుజరాత్ రాష్ట్రాన్ని వాయు తుఫాను వణికిస్తోంది. తీరం దాటే సమయం దగ్గరపడే కొద్దీ ఇది తీవ్రరూపం దాల్చుతోంది. ఈదురు గాలులు, వర్షంతో గుజరాత్ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి.
తుఫాను తీవ్రతకు అమ్రేలి, గిర్ సోమనాధ్, దివు, జునాగఢ్, పోరుబందర్, రాజ్కోట్, జామ్నగర్, దేవ్భూమి ద్వారక, కూచ్ జిల్లాల్లో గంటలకు 155కిలో మీటర్ల నుండి 165 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. సోమనాధ్ ఆలయంలో ఉన్న ప్రవేశద్వారం షెడ్డు పైకప్పు ఎగిరిపోయింది. పోరుబందర్లోని చౌపట్టీ బీచ్, వెరెవల్లోని జలేశ్వర్ సముద్ర తీరం వద్ద అలలు ఉగ్రరూపం దాల్చాయి.
వాయు తుఫాను మధ్యాహ్నం గుజరాత్లోని వేరావల్, ద్వారక మధ్య తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ తెలియజేసింది.
మధ్యాహ్నానికి గంటకు 180 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటోంది.
గుజరాత్ మంత్రి భూపేంద్ర సింగ్ చుడాసమా తుఫాను పరిస్థితులను సమీక్షిస్తున్నారు. సోమనాధ్ ఆలయం వద్దకు వెళ్లి పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయనీ, ఇప్పటికే ఇక్కడకు వచ్చిన పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి తెలిపారు. వర్షాలు తగ్గే వరకూ పర్యాటకులు రావద్దని మంత్రి భూపేంద్ర సింగ్ కోరారు.
ఈ తుఫాను ప్రభావం మహారాష్ట్ర తీర ప్రాంతాలకు తాకింది. కొంకణీ, మహిమ్ బీచ్లలో అలలు ఉగ్రరూపం దాల్చాయి. బీచ్ల వద్దకు ఎవరూ వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.