విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన వాయుగుండం బుధవారం భయపడి తీవ్ర వాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్ని ఆనుకుని బంగాళాఖాతం మీద కదులుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వరసగా నాలుగు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించారు. వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి బాలసోర్కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మంగళవారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల దాకా తూర్పుగోదావరి జిల్లా చింతూరులో 110, విశాఖపట్నం జిల్లా పాడేరులో 98 మిల్లీమీటర్లు , శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 60 మిల్లీ మీటర్ల గరిష్ఠ వర్షపాతం నమోదు అయ్యింది. గోదావరి వరదల కారణంగా నిర్వాసితులైన 23,244 మంది కుటుంబాలకు నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా వివిధ ప్రభుత్వ శాఖలకు 647 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ మేరకు ప్రాథమిక నివేదికలు తయారు చేశారు.
మరో పక్క వంశధార-నాగావళి నదికి వరద ప్రభావం పెరుగుతున్నది. తోటపల్లి వద్ద వరద ఉధృతి పెరిగింది. స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి వరద ఉధృతి విపత్తుల శాఖ కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రభావిత జిల్లాల, మండలాల అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేస్తున్నది.నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ సూచిస్తున్నారు.