అమరావతి: వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కోస్తా ప్రజానీకానికి వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో ఈ నెల 12నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన వాతావరణం ఉన్నట్లు తెలిపింది. ఇటీవల దాదాపు ఈ ప్రాంతంలోనే అల్పపీడనం ఏర్పడి ఆ తరువాత తీవ్ర వాయుగుండంగా మారింది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.
ప్రస్తుతం కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులు వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో ధాన్యాగారంగా పేరొందిన గోదావరి జిల్లాలు వరదలో చిక్కుకుపోయి విలవిల్లాడుతున్నాయి. ఈ తరుణంలో మరో అల్పపీడనం ఏర్పడుతోందని వాతావరణ శాఖ పేర్కొనడం ఆందోళన కల్గిస్తోంది.
మరో పక్క శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. భారీ వరద ప్రవాహం ఉండటంతో అధికారులు మొత్తం 12గేట్లకు గాను 10గేట్లను ఎత్తి దాదాపు 2,43,171 క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువన ఉన్న నాగార్జునసాగర్కు వదులుతున్నారు. నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోందని అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులు నమోదైంది. నీటి నిల్వ సామర్థ్యం 215.81 టిఎంసిలు కాగా ప్రస్తుతం 202.96 టిఎంసిలకు పైగా చేరింది. నాగార్జునసాగర్ జలాశయానికి కూడ వరద కొనసాగుతోంది. ఇన్ప్లో 1.02లక్షల క్యూసెక్కులు ఉండగా 6051 క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు వదులతున్నారు. సాగర్ నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 521 అడుగులకు చేరింది.