(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఎంపిక అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శివకుమార్ను పీసీసీ చీఫ్గా ఏ క్షణమైనా అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో, డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ పదవికి మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపిసిసి అధ్యక్ష పదవికి దినేష్ గుండురావు ఇద్దరూ రాజీనామా చేశారు. కేపీసీసీ అధ్యక్ష పదవి కోసం డీకే శివకుమార్ తోపాటు మాజీ హోంమంత్రి ఎంబీ పాటిల్ పోటీ పడ్డారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకే ఎంపీ స్థానంలో సరిపెట్టుకుంది. దీంతో పీసీసీ చీఫ్ గుండూరావును మార్చి కొత్త అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించారు. అయితే, అప్పటికే సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకోవడంలో గుండూరావు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో నూతన అధ్యక్షుడి ఎన్నిక తప్పనిసరి అయింది. మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య.. పార్టీ అధ్యక్షురాలు సోనియాను కలిసి అధ్యక్ష పదవికి ఎంబీ పాటిల్ సరైన వ్యక్తని సూచించారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం డీకే శివకుమార్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కూలడానికి సిద్ధరామయ్య కూడా కారణమని భావిస్తున్న సోనియా.. ఆయన ప్రతిపాదనను పక్కనపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
కర్ణాటకలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం అందులో భాగంగా శివకుమార్కే అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అదే జరిగితే సిద్ధరామయ్యకు పార్టీలో ప్రాధాన్యం తగ్గినట్టే అవుతుందని ఆయన వర్గీయులు అంటున్నారు. మాజీ మంత్రి పరమేశ్వర్ సహా పలువురు సీనియర్లు కూడా సిద్ధరామయ్యను వ్యతిరేకిస్తున్నారు. వారందరూ కూడా డీకేకే మద్దతు తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. డీకే శివకుమార్కు కేపీసీసీ అధ్యక్ష బాధ్యతలు దాదాపు ఖాయమని తేలడంతో సిద్ధరామయ్య వర్గంలో అసంతృప్తి మొదలైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు ప్రతిపక్ష నాయకుడిగా సిద్ధరామయ్యను కొనసాగిస్తారని తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసులో అరెస్టుయిన కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్కు గతేడాది అక్టోబర్ 23న బెయిల్ మంజూరైంది. మనీలాండరింగ్ కేసులో సెప్టెంబర్ 3న డీకే శివకుమార్కు ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పన్నులను ఎగ్గొట్టారని, కోట్లాది రూపాయల లావాదేవీలను అక్రమంగా నిర్వహించారని ఈడీ ఆరోపిస్తోంది. సుమారు 50 రోజుల పాటు డీకే. శివకుమార్ తీహార్ జైలులో విచారణ ఖైదీగా శిక్ష అనుభవించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న డీకే శివకుమార్ కు హైకమాండ్ దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరికీ డీకే. శివకుమార్ తెలుసు. 2017 రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకోవడంలో.. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం కోసం.. కాంగ్రెస్ నేతలు చేజారకుండా చూడటంలో.. రిసార్ట్ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడంలో డీకే. శివకుమార్ కీలక పాత్ర పోషించాడు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ కాకుండా డీకే. శివకుమార్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలను ఏకం చేసి వారిని రిసార్టుకు తరలించే భాద్యతను పూర్తిగా డీకే శివకుమార్ కు అప్పగించారు. హైకమాండ్ ఆదేశాలను డీకే. శివకుమార్ పక్కాగా పాటించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో తన మీద ఐటీ దాడులు జరిగినా డీకే. శివకుమార్ భయపడలేదు. బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల భాద్యతను అప్పగించడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉగ్రప్పను భారీ మొజారిటీతో గెలిపించుకుని హైకమాండ్ కు మరింత దగ్గర అయ్యాడు.